నీరవ్, సోదరి పూర్వీకి స్విట్జర్లాండ్ భారీ షాక్, రూ.283 కోట్లు ఫ్రీజ్
బెర్న్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి స్విట్జర్లాండ్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు చెందిన నాలుగు స్విస్ అకౌంట్స్ను సీజ్ చేసింది. ఆయన సోదరి పూర్వీ మోడీ ఖాతాలను కూడా అధికారులు స్తంభింపచేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విజ్ఞప్తి మేరకు అధికారులు ఫ్రీజ్ చేశారు.
నీరవ్ మోడీ, ఆయన సోదరి పూర్వీ మోడీలకు చెందిన ఖాతాల్లోని రూ.283.16 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ బ్యాంకుల నుంచి అక్రమంగా స్విస్ అకౌంట్లకు నిధులు మళ్లించారని ఈడీ.. స్విస్ అధికారులకు తెలిపింది.
మా దేశం నేరగాళ్లకు అడ్డాకాదు: మెహుల్ చోక్సీకి ఆంటిగ్వా షాక్
నీరవ్ మోడీ అకౌంట్లో 3,74,11,596 డాలర్లు, అతని సోదరి పూర్వీ మోడీ స్విస్ అకౌంట్లో 27,38,136 GBP (బ్రిటిష్ పౌండ్)లు ఉన్నాయని, మొత్తం రూ.283 కోట్లకు పైగా ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. పీఎన్బీ స్కాంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీతో పాటు పూర్వీ మోడీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ ద్వారా పీఎన్బీలో రూ.13,700 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్కాం వెలుగు చూడటానికి ముందే నీరవ్ మోడీ, బంధువులు లండన్ పారిపోయారు. లండన్కు పారిపోయి అక్కడ తలదాచుకోగా కొన్ని వారాల క్రితం నీరవ్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నాడు. నీరవ్ పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేయగా అవి తిరస్కరణకు గురయ్యాయి.
గురువారం ఆయనను లండన్లోని ఓ న్యాయస్థానంలో మరోసారి విచారించనుంది. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆయన వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరుకావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూకే చట్టాల ప్రకారం ఆయనపై విచారణ కొనసాగుతోంది. ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్ను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.