న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయుల నల్లధనం ఎంతుందో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం! 1980 నుంచి 2010 మధ్య కాలంలో అంటే ముప్పై ఏళ్లలో లెక్కలు చూపకుండా విదేశాలకు తరలించిన బ్లాక్ మనీ రూ.15 లక్షల కోట్ల నుంచి 34 లక్షల కోట్లుగా ఉందట. డాలర్లలో అయితే 216 బిలియన్ డాలర్ల నుంచి 490 బిలియన్ డాలర్లు. NIPFP, NCAER, NIFM అనే మూడు సంస్థలు నిర్వహించిన వేర్వేరు అధ్యయనాల్లో ఇది తేలింది. సోమవారం ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం ఈ నివేదికను లోకసభ ముందు ఉంచింది. ఈ స్థాయి సంఘానికి వీరప్ప మొయిలీ అధ్యక్షత వహించారు. రియల్ ఎస్టేట్, గనులు, ఔషధాలు, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, బంగారం, కమోడిటీలు, సినిమా, విద్య రంగాల్లో అత్యధికంగా లెక్క చూపని ఆదాయం ఉన్నట్లు తేలింది.

మూడు సంస్థలు ఏం చెప్పాయంటే...
నల్లధనం అంచనాకు విశ్వసనీయమైన విధానాలు లేవని, మూలధార భావనల ఆధారంగానే ఈ అంచనాలు రూపొందించినట్లు నివేదిక పేర్కొంది. ఈ మూడు సంస్థల అంచనాల్లో సారూప్యతలు కూడా లేవని పేర్కొంది. NCAER (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్) అంచనా మేరకు 1980 నుంచి 2010 మధ్యకాలంలో భారతీయులు లెక్కల్లో చూపని రూ.26.65 లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల ఆస్తుల్ని విదేశాల్లో కూడబెట్టారు. NIFM (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్) అంచనా మేరకు అదే కాలంలో రూ.15 లక్షల కోట్లు విదేశాలకు అక్రమంగా తరలింది. అయితే లెక్కల్లో చూపని ఆదాయంలో ఇది పది శాతం మాత్రమేనని కూడా పేర్కొంది. NIPFP అంచనా ప్రకారం 1997 నుంచి 2009 మధ్య కాలంలో జీడీపీలో 0.2 శాతం నుంచి 7.4 శాతం మేరకు లెక్కల్లో చూపని ఆదాయం దేశం దాటింది.

బ్లాక్మనీపై నివేదిక
బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడ కూడబెడుతున్నారనే అంశంపై కచ్చితమైన అంచనాలు లేవని, అలాంటి అంచనాలు వేయడానికి కచ్చితమైన, ఆమోదయోగ్యమైన పద్ధతి కూడా లేదని పేర్కొంటూ 'స్టేటస్ ఆఫ్ అన్ అకౌంటెడ్ ఇన్కమ్/వెల్త్ బోత్ ఇన్సైడ్ అండ్ ఔట్సైడ్ ద కంట్రీ-ఎ క్రిటికల్ ఎనాలసిస్' అనే పేరుతో రూపొందించిన నివేదికలో స్థాయీ సంఘం పేర్కొంది. పలు సర్దుబాట్లను పరిగణలోకి తీసుకొని ఊహల ఆధారంగా రూపొందించినట్లు పేర్కొంది. బ్లాక్ మనీ పైన వివిధ సంస్థలు వేరువేరుగా కట్టిన అంచనాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయని పేర్కొంటూ ఆ వివరాలు తెలిపింది. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉందని చెప్పడం కష్టమని, కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొంది.

భారత బడ్జెట్ కంటే ఎక్కువ...
ఆ మూడు నివేదికలను కలపడం ద్వారా అంచనాను ఖరారు చేయడానికి ఆస్కారం లేదని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడినట్లు పేర్కొంది. కొందరు సాక్షులను విచారించాల్సి ఉందన్నారు. దేశం లోపల, వెలుపలి నల్లధనంను వెలికి తీసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా కృషి చేయాలన్నారు. నల్లధనంపై ఏర్పాటు చేసిన SIT ఇచ్చిన ఏడు నివేదికలపై, తాజా మూడు నివేదికలపై తదనంతర చర్యలు తీసుకోవాలని సూచించింది. పార్లమెంటరీ స్థాయి సంఘం అంచనా ప్రకారం విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం రూ15,00,000 కోట్ల నుంచి రూ.34,00,000 కోట్లుగా ఉంది. ఇది భారత వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ.


Click it and Unblock the Notifications