ఫ్యాషన్ రంగంలోకి టాటా గ్రూప్..తక్కువ ధరకే ట్రెండీ బట్టలు
ముంబై: దక్షిణాఫ్రికా అపారెల్ సంస్థ జారాతో పదేళ్ల క్రితం జట్టుకట్టిన టాటా సంస్థ..ఇప్పుడు సొంతంగా భారత్లో వస్త్ర దుకాణాలు ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. అయితే జారాలో దొరికే దుస్తుల కంటే సగం ధరకే కస్టమర్లకు అందివ్వనున్నారు. టాటాకు చెందిన రీటెయిల్ సంస్థ ట్రెంట్ లిమిటెడ్ ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఫ్యాషన్ దుస్తులను అందిస్తూ ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా టాటా సంస్థకు చెందిన ట్రెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 40 ఔట్లెట్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ట్రెంట్ సంస్థ ద్వారా తమ వినియోగదారులకు జారా అందించే దానికంటే సగం ధరలకే దుస్తులను అందించనున్నట్లు ట్రెంట్ ఛెర్మెన్ నోయల్ టాటా చెప్పారు. ఏ నగరంలో అయితే ప్రజలు ఎక్కువగా ట్రెండ్ను ఫాలో అవుతూ ఫ్యాషన్ రంగం వైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారో అలాంటి నగరాల్లో తమ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు నోయల్ తెలిపారు.
మధ్యతరగతి వారు పెరిగిపోతున్నారని, ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పిన నోయల్.... భారతీయులు ఖర్చు కూడా ఎక్కువ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లను ఆకట్టుకుని మార్కెట్లో త్వరగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని నోయల్ చెప్పారు. టాటా గ్రూప్లో ఒకటైన ట్రెంట్ సంస్థ త్వరలోనే సప్లై చైన్ను ప్రారంభించి ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లో జారా ఎలాగైతే గుర్తింపు పొందిందో ట్రెంట్ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందుతుందని నోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉండటంతో ప్రజల ఫ్యాషన్ వైపు అడుగులు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుడు చిన్న పట్టణం నుంచి వచ్చినా తన ఫేవరెట్ నటుడు ఎలాంటి డ్రెస్సులు వేస్తాడో అలాంటివే వేయాలని అనుకుంటున్నాడని అభిజీత్ కుందు అనే నిపుణుడు చెప్పారు.
ఇక మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఫ్యాషన్ స్టోర్లతో పోలిస్తే ట్రెంట్ సంస్థ మరింత ట్రెండీగా వినియోగదారుల ముందుకు వస్తుందని నోయల్ తెలిపారు. ఇక ట్రెంట్ సంస్థ దేశీయ వస్త్ర దుకాణాల నుంచి వచ్చే మోడల్స్తో కూడా పోటీ పడాల్సి వస్తుందని, ఇందుకోసమే ట్రెంట్ సప్లై చైన్ను వేగవంతంగా వ్యాప్తి చెందేలా చేయాలని నోయల్ తెలిపారు.