అన్ని రకాల రిటర్న్స్కు ఒకే ఫామ్!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సెల్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ (NAA) మరో రెండేళ్లు పొడిగించింది. నవంబర్ 2021 వరకు అమలును పొడిగించారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఫిర్యాదులు అత్యధికంగా రావడంతో వీటిని పరిష్కరించే ఉద్దేశ్యంతో NAAను ఏర్పాటు చేశారు. దీనిని 2017 జూలైలో ఏర్పాటు చేశారు. అలాగే జిఎస్టీ రిటర్న్స్ను సరళతరం చేస్తూ అన్ని రిటర్న్స్కు ఒకే ఫామ్ ఉండేలా నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయించింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆధార్ను ప్రూఫ్గా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది.
భారత్ అధిక టారిఫ్లపై మరిన్ని చర్యలు: అమెరికా హెచ్చరిక
ఆ సంస్థలకు జరిమానా
పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేటును తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలీ చేయకుండా లాభపడుతున్న సంస్థలపై కౌన్సెల్ కొరడా ఝులిపించింది. ఆయా సంస్థలకు వచ్చిన లాభాల్లో 10 శాతం వరకు జరిమానా విధించేందుకు కౌన్సెల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చు. జీఎస్టీ రిటర్న్స్ గడువును మరో రెండు నెలలు పెంచుతూ కౌన్సెల్ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 30, 2019 వరకు దాఖలు చేయవచ్చు.
జీఎస్టీ రిటర్న్స్
సరుకుల రవాణాకు సంబంధించి ఈ వే బిల్లులు అమల్లోకి వచ్చిన నాటి నుంచి వరుసగా 2 నెలలుగా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయనివారికి ఊరటను ఇచ్చింది. వీరు ఆగస్ట్ 21 వరకు రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ సిస్టమ్ పైలెట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది తొలిరోజునే ప్రారంభించనున్నారు. జీఎస్టీలో రిజిస్టార్ చేసుకున్న మల్టీఫ్లెక్స్లు ఈ టిక్కెట్లు జారీ చేయాలి. విద్యుత్ వాహనాలకు సంబంధించి జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఫిట్మెంట్ కమిటీకి అప్పగించారు. ఎలక్ట్రానిక్ చార్జర్లను 18 శాతం శ్లాబ్ నుంచి 12 శాతం శ్లాబ్కు తగ్గించే అంశాన్ని కూడా కమిటీకి అప్పగించారు. అలాగే, లాటరీపై పన్ను రేటును నిర్ణయించే అవకాశాన్ని అటార్నీ జనరల్కు అప్పగించింది జీఎస్టీ కౌన్సెల్.
జనవరి 1 నుంచి కొత్త ఫైలింగ్ విధానం..
2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ రశీదుల విధానాన్ని అమలులోకి తేనున్నారు. ఈ ప్రతిపాదనలో భాగంగా రూ.50 కోట్లకు మించి టర్నోవర్ కలిగిన సంస్థలు B2B విక్రయాలకు ప్రభుత్వ పోర్టల్ నుంచి ఎలక్ట్రానిక్ రసీదులను తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ రిటర్న్స్కు సంబంధించి కొత్త విధానాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తామని రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే చెప్పారు.