అప్పులు.. వడ్డీలు.. ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి: హోదాతో ఎలా లాభాలు!
2014లో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.97 వేల కోట్లు అయితే ఇప్పుడు రూ.2,58,928 కోట్లుగా ఉందని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర అసెంబ్లీలో వాపోయారు. ప్రత్యేక హోదాపై మంగళవారం (18, జూన్) తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయన మరోసారి ఏకరువు పెట్టారు. మనకు ప్యాకేజీ వద్దు, హోదానే కావాలని తీర్మానం చేస్తున్నామన్నారు. 59 శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా పొందామన్నారు. విభజనలో మౌళిక సదుపాయాలు అతి తక్కువగా వచ్చాయని చెప్పారు. విభజన వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదాతోనే దానిని పూడ్చగలమన్నారు.
చదవండి: తెలంగాణకు మిగులు ఎంత అంటే, ఏపీపై ఏడాదికి 40 వేలకోట్ల అప్పు: జగన్ ఆందోళన
మనకు ఉన్న రుణాల కారణంగా ప్రతి సంవత్సరం అసలు రూ.20వేల కోట్లు, వడ్డీ మరో రూ.20వేల కోట్లు చెల్లించవలసి వస్తోందన్నారు. ఆదాయాన్ని, ఉద్యోగాన్ని ఇచ్చే హైదరాబాద్ లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, మౌలిక సదుపాయాలు కల్పించగలమని చెప్పారు. హోదా వస్తే రాష్ట్రాలకు ఆదాయంపన్ను, జీఎస్టీ మినహాయింపు వస్తాయని చెప్పారు.
హోదా కలిగిన రాష్ట్రాలకు తలసరి గ్రాంట్ రూ.5,573 అయితే ఏపీలో మాత్రం రూ.3,428 మాత్రమే ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదానే ఏపీకి జీవనాడి అన్నారు.

గత అయిదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు రూ.66,300 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గినట్లు తెలిపారు. ఉద్యోగాల కోసం ఏపీ యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయని, పెట్టుబడులు వస్తాయని, ఐటీ, జీఎస్టీ మినహాయింపులు వస్తాయని చెప్పారు. హోటళ్లు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
జాప్యం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున కోరుతున్నామన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, దానిని అమలు చేయాలన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి హోదాతో భర్తీ చేస్తామని చెప్పారన్నారు. తక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రం కాబట్టి ఏపీకి న్యాయం చేయాలన్నారు. కాగా, గత అసెంబ్లీ కూడా ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.


Click it and Unblock the Notifications