తెలంగాణ ఎమ్మెల్యేలకు రూ.166 కోట్లతో కొత్త భవనాలు: సౌకర్యాలు ఇవే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు హైదర్గూడలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేసీఆర్ క్వార్టర్స్ను పరిశీలించారు.
120 మంది ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల విస్తీర్ణంలో రూ.166 కోట్లతో ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఫ్లోర్కు 10 చొప్పున 12 అంతస్తుల్లో 120 క్వార్టర్స్ నిర్మించారు. ఒక్కో క్వార్టర్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో మూడు బెడ్రూంలు కలిగి ఉన్నాయి. ట్రిబుల్ బెడ్రూంతో పాటు హాలు, కిచెన్, డ్రాయింగ్ రూమ్, విజిటర్ రూమ్ ఉంటాయి. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టారు.
వీటికి అనుబంధంగా 325 చదరపు అడుగుల చొప్పున 120 సర్వెంట్ క్వార్టర్స్ను, సిబ్బందికి (స్టాఫ్) 36 క్వార్టర్స్ ఉన్నాయి. ఇది ఒక్కో ప్లాటు వెయి చదరపు అడుగులతో ఉంటుంది. స్టాఫ్ క్వార్టర్స్ను ఆరు అంతస్తుల్లో నిర్మించారు. మొత్తం 36 ఉంటాయి.
ఒక్కో ప్రజాప్రతినిధికు రెండు కార్లకు అవసరమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. మొత్తంగా 276 కార్ల పార్కింగ్కు సౌకర్యం కల్పించారు. ఈ వాహనాలు నిలిపేందుకు సెల్లార్లో మూడంతస్తులు నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 23 సమావేశ కేబిన్లను ఏర్పాటు చేశారు. ఐటీ, మౌలిక సౌకర్యాల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో ప్రత్యేకంగా బ్లాక్ నిర్మించారు. సెక్యూరిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది లిఫ్టులు ఏర్పాటు చేశారు. 5 మెట్ల దారులు ఉన్నాయి.
క్లబ్ హౌస్, వ్యాయామశాల, సూపర్ మార్కెట్ ఉన్నాయి. ఇక, ఐటీ అండ్ ఎమినిటీస్ బ్లాక్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, క్యాంటీన్ ఉంటాయి. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్ సెంటర్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ ఉంటాయి. 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంప్, 1,000 కేవీ ట్రాన్సాఫార్మర్లు ఉంటాయి.