PM Kisan Pension: నెలకు రూ.100 చెల్లిస్తే.. రూ.3,000 పెన్షన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతన్నలు తమ వంతుగా నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అన్నదాతల పేరిట అంతే మొత్తాన్ని కేంద్రం కూడా పెన్షన్ నిధికి జమ చేస్తుంది. గురువారం నాడు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా పీఎం కిసాన్ పెన్షన్ పథకం గురించి చర్చించారు. ఈ పథకాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు త్వరగా అమలు చేయాలని కోరారు. పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
రైతుబంధు: డబ్బు రాకుంటే ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్లో ఎలా పడుతుంది?
నెలకు రూ.100 చెల్లిస్తే.. రూ.3,000 పెన్షన్
ఈ పింఛన్ పథకంలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సుగల రైతుల వివరాలు నమోదు చేయాలని కేంద్రమంత్రి కోరారు. ఈ స్కీంలో చేరే రైతులు నెలకు రూ.100 చెల్లించాలని, ప్రీమియం వయసును బట్టి మారుతుందని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా వచ్చే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛనుకు వాటాను చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కారం కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం ఇటీవల పీఎం కిసాన్ పింఛను పథకం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. రైతులకు వృద్ధాప్యంలో అండగా నిలవడమే ఈ స్కీం ఉద్దేశ్యం. ఈ పథకంలో చేరే రైతులకు 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. వీటి నిర్వహణ, చెల్లింపు బాధ్యతలను LIC చూస్తోంది. రానున్న మూడేళ్లలో 5 కోట్ల మంది రైతులకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఏటా రూ.10,774.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి డిడక్ట్ వెసులుబాటు
ఎవరైనా రైతు 29 ఏళ్ల వయస్సులో పిఎం కిసాన్ పెన్షన్ స్కీంలో చేరితే అలాంటి వారు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం కేంద్ర ప్రభుత్వంకూడా సదరు రైతు పేరిట జమ చేస్తుంది. ఈ స్కీం కింద కనీస పెన్షన్ను రూ.3,000గా ఫిక్స్ చేశారు. 60 ఏళ్ల తర్వాత ఈ పెన్షన్ వస్తుంది. దేశంలోని 14.5 కోట్ల మంది రైతులకు ఈ స్కీం చేరాలని కేంద్రం భావిస్తోంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.87,000 కోట్ల భారం పడనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి నేరుగా పీఎం పెన్షన్ స్కీంకు నెలకు రూ.100 డెడక్ట్ అయ్యేలా రైతులు ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఈ పథకం వల్ల చిన్న, మధ్య తరగతి రైతులకు సామాజిక రక్షణ ఉంటుంది.
రైతుల కోసం...
ఇదిలా ఉండగా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సూచించారు. అలా అయితే ఏప్రిల్ - జూలై కాలానికి అందాల్సిన నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చునని చెప్పారు. అర్హులైన రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా మోడీ ప్రభుత్వం రూ.6వేల కోట్లు మూడు విడతల్లో పెట్టుబడి సాయంగా ఇస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం పైన కూడా ప్రచారం మరింత ప్రచారం కల్పించాలని కేంద్రమంత్రి చెప్పారు.