రూ.21,000 లోపు ఉద్యోగులకు గుడ్న్యూస్: ESI 6.5% నుంచి 4% తగ్గింపు, ప్రయోజనాలు ఇవే..
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ESIC- Employees State Insurance Corporation)కు చెల్లిస్తున్న మొత్తాన్ని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు గురువారం కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాల్లో 6.5 శాతం ఈఎస్ఐ కోసం చెల్లిస్తున్నారు. దీనిని కేంద్రం 4 శాతానికి తగ్గించి గుడ్ న్యూస్ చెప్పింది. ఇది వచ్చే నెల (జూలై) ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానుంది.
SBI గుడ్న్యూస్: హోమ్ లోన్స్పై తగ్గనున్న వడ్డీ రేటు
ఉద్యోగులు, యాజమాన్యం వాటా ఎంత తగ్గిందంటే?
ఇప్పటి వరకు 6 శాతం చెల్లింపు వాటాలో ఎంప్లాయర్ (యజమాని) 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లించేవారు. జూలై 1వ తేదీ నుంచి యాజమాన్యం వాటా 4.75 నుంచి 3.25 శాతానికి, ఉద్యోగి వాటా శాతం 1.75 నుంచి 0.75 శాతానికి తగ్గనుంది. కేంద్రం ఈ నిర్ణయం వల్ల 3.6 కోట్ల మంది ఉద్యోగులకు, 12.85 లక్షల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని వల్ల సంబంధిత ఇండస్ట్రీకి ఏడాదికి రూ.5,000 కోట్లు ఆదా అవుతాయి. 1997 తర్వాత.. అంటే 22 ఏళ్ల తర్వాత ఈఎస్ఐ (Employees State Insurance-ESI) పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ESIతో లాభాలు...
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ యాక్ట్ 1948 (ESI act) కింద మెడికల్, క్యాష్, మెటర్నిటీ, డిసబులిటీ, డిపెండెంట్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఏడాదికి గరిష్టంగా 91 రోజులు సిక్నెస్ బెనిఫిట్స్ 70 శాతం పొందుతారు. అంటే 91 రోజులు సిక్గా ఉంటే 70 శాతం చెల్లిస్తారు. 26 వారాల మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి వంద శాతం చెల్లిస్తారు. వైద్యుడి సూచనల మేరకు మరో నెల రోజుల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పర్మినెంట్ డిజబులిటీ అయితే 90 శాతం వేజెస్ ఉంటుంది. చనిపోయిన వర్కర్ కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ బెనిఫిట్స్ ఇస్తారు. ఉద్యోగులు, యాజమాన్యాలు ప్రతి నెల కొంత మొత్తాన్ని (ప్రభుత్వం నిర్ణయించిన శాతం) చందా కింద చెల్లిస్తారు. ఈ చెల్లింపులు తప్పనిసరి. వీరికి బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఉద్యోగులు, యాజమాన్యం కంట్రిబ్యూట్ చేసే ఈ మొత్తాలను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం నెలకు రూ.21,000 వరకు వచ్చేవారు ఈఎస్ఐ బెనిఫిట్స్కు అర్హులు. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈఎస్ఐకి చందాల రూపంలో రూ.22,279 కోట్లు వచ్చాయి.
ఈ లక్ష్యంతో వాటా శాతం తగ్గింపు
ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని (కంట్రిబ్యూషన్ను 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం ద్వారా) తగ్గించడం వల్ల మరింత మంది ఈఎస్ఐలో చేరే అవకాశం ఉందని, దీనివల్ల వారు కూడా సంఘటిత రంగ కార్మికులుగా మారతారని కార్మక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా యాజమాన్యాలపై భారం తగ్గించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నెలకు రూ.21వేల లోపు జీతం ఉన్నవారు ఈఎస్ఐలో చేరితే వారికి అనారోగ్య సమయంలో వైద్యసేవలతో పాటు, సందర్భాన్నిబట్టి నగదు సాయం కూడా లభిస్తుంది.