ఇంటర్నెట్ వాడకంలో చైనా తర్వాత భారత్: జియో ప్రయత్నాలు ఇలా...
న్యూఢిల్లీ: భారత్లో ఇంటర్నెట్ యూజర్లు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నారట. ప్రపంచంలో భారత్ ఇంటర్నెట్ వాటా 12 శాతంగా ఉందని మేరీ మీకర్ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఇందులో జియో పాత్ర ఎక్కువగా ఉందట. అధిక ఇంటర్నెట్ వినియోగంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. హైస్పీడ్ డేటా సేవల్ని (4జీ), తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో పాత్ర చాలా కీలకమని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇంటర్నెట్ ట్రెండ్స్పై మేరీ మీకర్ స్టడీ చేస్తుంటుంది. అమెరికాను మినహాయిస్తే, ఇతర ప్రపంచ దేశాల్లో అత్యంత వినూత్న సేవలు అందిస్తున్న ఇంటర్నెట్ ప్రొవైడర్లలో జియో ఒకటి పేర్కొంది.
ఎయిర్టెల్కు జియో భారీ 'రెవెన్యూ' దెబ్బ
12 శాతంతో రెండో స్థానంలో భారత్
ప్రపంచవ్యాప్తంగా 3.8 బిలియన్ల మంది (380 కోట్లు) ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ. ఇంటర్నెట్ అత్యధికంగా వినియోగించే విషయంలో చైనా 21 శాతంతో మొదటి స్థానలో ఉంది. అమెరికా 8 శాతంతో ఉంది. భారత్ 12 శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల శాతం ఏటికేడు పెరుగుతోంది. అయితే 2018లో పెరుగుదల 6 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది పెరుగుదల 7 శాతం. జియో ఫ్రీ వాయిస్కాల్, చీప్ డేటా ప్లాన్ కారణంగా డేటా ఉపయోగం ఏడాదిలోనే రెండింతలు అయ్యేందుకు దోహదపడిందని పేర్కొంది.
టాప్ 15 దేశాలు ఇవే
స్మార్ట్ఫోన్ షిప్మెంట్ 2018లో 4 శాతం తగ్గిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల సెర్చింజన్ గూగుల్ యాడ్ రెవెన్యూ గత తొమ్మిది క్వార్టర్లుగా 1.4 రెట్లు పెరగగా, ఫేస్బుక్ రెవెన్యూ 1.9 రెట్లు పెరిగిందని వెల్లడైంది. టాప్ 15 ఇంటర్నెట్ యూజర్లలో వరుసగా.. చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, బ్రెజిల్, జపాన్, రష్యా, మెక్సికో, జెర్మనీ, పిలిప్సీన్, యునైటెడ్ కింగ్డమ్, ఇరాన్, నైజీరియా, ఫ్రాన్స్, టర్కీలు ఉన్నాయి.
రిలయన్స్ జియో ప్రభావం
రిలయన్స్ జియో మొబైల్ కనెక్షన్లు 307 మిలియన్లుగా ఉన్నాయి. జియో ఈ-కామర్స్ రంగాన్ని ఆఫ్లైన్ మార్కెట్తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని మేరీ మీకర్ తన నివేదికలో పేర్కొంది. ఫ్రీ కాల్స్, డేటాకు తక్కువ ఛార్జ్ వసూలు చేయడంతో జియో కొద్ది రోజుల్లోనే 30 కోట్లకు పైగా సబ్స్కైబర్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. రిలయన్స్ రిటైల్కు వచ్చే 35 కోట్ల మందిని, జియో చందాదార్లయిన 30.7 కోట్ల మందిని, 3 కోట్ల మంది చిరు వ్యాపారులను అనుసంధానం చేసి, మారమూల ప్రాంతాల వినియోగదారులకు అన్ని రకాల వ్యాపార ప్రయోజనాలు చేకూరుస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం గుర్తుచేసింది. తమ ఆన్లైన్ పోర్టల్ నుంచి సరుకు చేరవేసేందుకు, వస్తువుల సమీకరణకు కేంద్రాలుగా జియో స్టోర్లను వినియోగించుకోవాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. మొత్తం 95 శాతం జనాభాకు చేరువ కావాలని టార్గెట్గా పెట్టుకున్నారు.