గుడ్న్యూస్: జూలై 1 నుంచే ఛార్జీలు ఎత్తివేత, నీలేకని సూచనలే...
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్లైన్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను ఎత్తివేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి బ్యాంకులకు వారం రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్ ట్రాన్సుఫర్పై ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
మరో గుడ్న్యూస్.. ఆన్లైన్ నగదు బదలీపై వసూళ్లుండవ్: NEFT, RTGS ఛార్జీలు ఎత్తివేత
జూలై 1వ తేదీ నుంచి నో ఛార్జీ
ఆన్లైన్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఎత్తివేసిన నేపథ్యంలో NEFT, RTGS ద్వారా జరిపే లావాదేవీలపై వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందించాలని ఆర్బీఐ సూచించింది. NEFT ద్వారా రూ.2 లక్షల వరకు ట్రాన్సుఫర్ చేసే అవకాశం ఉండగా, RTGS ద్వారా ఎంత మొత్తమైన పంపించుకునే వెసులుబాటు ఉంది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ మినిమం ఛార్జ్ వసూలు చేస్తోంది. దీంతో బ్యాంకులు కూడా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ప్రతి నెఫ్ట్ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తుండగా, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్లపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది.
నందన్ నీలేకని కమిటీ సూచనలు
దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ కూడా పలు సిఫార్సులు చేసింది. ఛార్జీలను ఎత్తివేయడం, RTGS, NEFT సదుపాయం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడటం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల దిగుమతులపై సుంకాల తొలగింపు వంటి సూచనలు చేసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును గత నెలలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు నందన్ నీలేకని కమిటీ అందించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది.
RTGS, NEFT ట్రాన్సుఫర్లు పెరిగే ఛాన్స్
RTGS, NEFT ద్వారా పెద్ద మొత్తంలో ట్రాన్సుఫర్ జరుగుతోంది. ట్రిలియన్ల రూపాయల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నెఫ్ట్, ఆర్టీజీఎస్ పైన ఛార్జీలు వసూళ్లు ఉండకపోవడంతో ఈ ట్రాన్సాక్షన్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. నెఫ్ట్ ద్వారా రూ.10,000 వరకు ట్రాన్సుఫర్ చేస్తే రూ.2.50 ఛార్జీ వసూలు చేస్తారు. రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రూ.5, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15 ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువగా పంపించవచ్చు. దీనికి రూ.25 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఊరట లభించనుంది.