GST గుడ్న్యూస్, 28% శ్లాబ్ నుంచి మరిన్ని ఐటమ్స్ ఔట్!: ఎక్కువ శ్లాబ్ కావాలని రెస్టారెంట్లు
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) అమలులోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎక్కువ శ్లాబ్లో ఉన్న వస్తువులను తక్కువ శ్లాబ్లోకి తీసుకు వస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. జీఎస్టీలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబ్లు ఉన్నాయి. కొన్ని వస్తువులపై సున్నా శాతం పన్ను ఉంటుంది. జీఎస్టీ కౌన్సెల్ ఈ నెల మరోసారి భేటీ కానుంది. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా 28 శాతం శ్లాబ్లో ఉన్న మరిన్ని ఐటమ్స్ను తక్కవ శ్లాబ్లోకి తీసుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు
28 శాతం నుంచి మరిన్ని ఐటమ్స్ ఔట్
28 శాతం పన్ను శ్లాబ్ నుంచి మరిన్ని ఉత్పత్తుల్ని తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం 28 శాతం శ్లాబ్లో ఉంది. పన్ను రేట్లను తగ్గించడానికి కూడా కొన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి విన్నవించాయి. 20వ తేదీన జరిగి జీఎస్టీ కౌన్సెల్లో పన్ను రేట్లకు సంబంధించి చర్చించనున్నారు.
కేంద్రానికి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ
ఇదిలా ఉండగా, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ స్ట్రక్చర్ పైన లేఖ రాసింది. తాము అధిక జీఎస్టీ శ్లాబ్లోకి వెళ్లేందుకు సిద్ధమని పేర్కొంది. అందుకు కారణం ఉంది. తక్కువ శ్లాబ్లో ఉండటం వల్ల తాము ముడి సరుకులు, ఇతర ఖర్చులపై రీఫండ్ చేసుకోలేకపోతున్నామని, ఎక్కువ శ్లాబ్లోకి వేస్తే దానిని రీఫండ్ చేసుకుంటామని చెబుతున్నారు.
5 శాతం నుంచి 12 శాతం శ్లాబ్లోకి వేయండి
రెస్టారెంట్లు ప్రస్తుతం 5 శాతం శ్లాబ్లో ఉన్నాయి. అయితే అంతకంటే ఎక్కువ శ్లాబ్ను ఎంపిక చేసే అవకాశం ఇవ్వాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమ లేఖలో కోరింది. డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్.. 12 శాతం, 5 శాతం ఇవ్వాలని కోరింది. రెస్టారెంట్ల జీఎస్టీ శ్లాబ్ను అధిక 12 శాతంలోకి తీసుకు వచ్చి, ఆ తర్వాత రీఫండ్ క్లెయిమ్ ఇవ్వాలని కోరాయి. ఇతరులకు 5 శాతం ఇవ్వాలని కోరాయి. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్టర్కు లేఖ రాశాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మెక్ డొనాల్డ్స్, డామినోస్ పిజ్జా వంటి 5 లక్షల రెస్టారెంట్లు ఉన్నాయి.
ఆటోమొబైల్స్పై భారం
ఆటోమొబైల్ ఉత్పత్తులపై 28 శాతం పన్ను విధిస్తుండటం ఆ రంగానికి భారంగా మారింది. ఇప్పటికే డిమాండ్ మందగించటంతో పాటు వచ్చే ఏడాది నుంచి బీఎస్ 6 ప్రమాణాలు అమల్లోకి వస్తున్నాయి. దీంతో మరింతగా దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను ప్రవేశపెట్టే అంశంపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఏ ఉత్పత్తులను 28 శాతం నుంచి తక్కువ శాతం శ్లాబ్లోకి వేస్తారో మరో పది రోజుల్లో తేలనుంది.