చందాకొచ్చార్కు ఈడీ మళ్లీ నోటీసులు, విచారణ తేదీ మార్పు
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చార్ను మరోసారి విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్ మనీలాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసులో వచ్చేవారం హాజరు కావాలని ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంలో చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్లు మనీలాండరింగ్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదివరకే వారిని విచారించారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు.
ATM ట్రాన్సాక్షన్పై ఇప్పుడిలా... కొద్ది రోజుల్లో మూడో తీపి
ఈ నెల 10న ఢిల్లీలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 6వ తేదీనే హాజరుకావాలని ఈడీ సూచించింది. అయితే కొన్ని కారణాల వల్ల తాను ఆ రోజు హాజరుకాలేనని, విచారణను మరో రోజుకు మార్చాలని చందాకొచ్చార్ కోరారు. దీంతో ఈడీ వచ్చే సోమవారం రావాలని పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి చందాకొచ్చార్ దంపతులు గత నెలలో దర్యాఫ్తుకు హాజరయ్యారు. మే 13 నుంచి 17 వరకు అయిదు రోజుల పాటు ఈడీ అధికారులు వారిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ముంబై, ఔరంగాబాద్లలోని చందాకొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్ గ్రూప్నకు చెందిన వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు చేశారు. అనంతరం ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారించారు.
వీడియోకాన్ గ్రూప్ రుణాల అవకతవకలపై చందాకొచ్చర్ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ రూ.3,250 కోట్ల రుణాలు పొందగా, దీనికి ప్రతిఫలంగా దీపక్ కొచ్చార్ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. వారిపై మనీ లాండరింగ్ క్రిమినల్ కేసు నమోదయింది.