తెలుగు వ్యక్తి పొట్లూరి రాజమోహనరావుకు స్విస్ బ్యాంక్ నోటీసులు!
స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పలువురు భారతీయులకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇటీవల నోటీసులు ఇస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయుడికి నోటీసులు జారీ చేసింది. అతడు తెలుగువాడైన పొట్లూరి రాజామోహన్ రావు. గత కొద్దికాలంగా స్విస్ గవర్నమెంట్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పుడు తెలుగు వ్యక్తికి ఇవ్వడం సంచలనంగా మారింది. ఆయనకు గత నెల (మే) 28వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ పేర్లు చెప్పకుండా పుట్టిన తేదీలతో వారికి నోటీసులు జారీ చేస్తోంది. ఇలా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అందులో ఈ పుట్టిన తేదీ (1951, జూలై 15) పొట్లూరిదే. అయితే ఆయన పేరును కూడా పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తోంది.
బ్లాక్మనీపై చివరి చాన్స్: M.L.A. సహా 11మంది భారతీయులకు స్విట్జర్లాండ్ నోటీసులు!
నోటీసులు
దాదాపు పద్నాలుగు మంది భారతీయులకు గత నెల స్విట్జర్లాండ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ గవర్నమెంటుకు వారి ఖాతా వివరాలు ఇచ్చే అంశంపై స్పందించేందుకు వీరికి చివరి అవకాశం ఇస్తోంది స్విస్ గవర్నమెంట్. ఇందులో భాగంగా తెలుగు వ్యక్తికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇతర వ్యక్తిగత వివరాలు తెలియనప్పటికీ టెలికం వ్యాపారంతోపాటు భారత్లోని దక్షిణాది రాష్ట్రాల్లో పలు వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తా అనే చర్చ సాగింది. పేరు ప్రకారం తెలుగువాడిగా తెలుస్తోంది.
కంపెనీల్లో డైరెక్టరుగా
అతడికి సంబంధించిన ఇతర వివరాలను బయట పెట్టలేదు. వివరాల ప్రకారం చూస్తే అతనికి బెంగుళూరు కేంద్రంగా పనిచేసే యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని తెలుస్తోంది. ఈ కంపెనీ టీవీలు, రేడియో రిసీవర్లు, సౌండ్ అండ్ వీడియో రికార్డింగ్స్ వంటి వస్తువులు ఉత్పత్తి చేస్తోంది. స్టాక్ ఎక్స్చేంజ్ల్లో నమోదు కాని, ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డులోని మిగిలిన సభ్యులందరూ ఆయన బంధుమిత్రులని తెలుస్తోంది. యునైటెడ్ టెలికమ్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు మరో ఏడు కంపెనీల్లోనూ డైరెక్టర్గా ఉన్నారని తెలుస్తోంది.
భారతీయులకు నోటీసులు
తమ దేశంలోని బ్యాంకుల్లో నిధులు దాచుకున్న భారతీయులపై స్విస్ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోన్న విషయం తెలిసిందే. మీ బ్యాంక్ ఖాతా వివరాలు భారత ప్రభుత్వానికి చెప్పేందుకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే పది రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని స్విస్కు చెందిన ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) తన నోటీసులలో పేర్కొంటుంది.
గత నెల 21న తమ బ్యాంకుల్లో అనుమానాస్పద ఖాతాలు ఉన్న 11 మంది భారతీయులకు స్విస్ బ్యాంకులు నోటీసులు జారీ చేసింది. భారత్తో కుదిరిన ఒప్పందం ప్రకారం స్విట్జరాండ్ ప్రభుత్వం తమ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న అనుమానాస్పద ఖాతాల వివరాలను, ఈ సంవత్సరం జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందిస్తోంది.