ఇన్ఫ్రా కంపెనీలపై జగన్ టార్గట్..! మొదటికి వస్తున్న కాంట్రాక్టులు..!!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులను దక్కించుకున్న మౌలిక సదుపాయాల కంపెనీలు ఆయోమయంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ (ఏపీ) కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనూహ్య నిర్ణయమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందు పనుల అనుమతి ఆర్డర్లు పొంది, పనులు మొదలుపెట్టని ప్రాజెక్టులను రద్దు చేయనున్నట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం..! ప్రాజెక్టులకు రద్దు గండం..!!
దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఇన్ఫ్రా సంస్థలకు చెందిన రూ.వేల కోట్ల కాంట్రాక్టుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. కొత్త ప్రభుత్వం నిర్ణయంతో ఏకంగా రూ.6,100 కోట్ల విలువైన కాంట్రాక్టులను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎన్సీసీ లిమిటెడ్ వెల్లడించింది. ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టులను ప్రారంభించకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఎన్సీసీ ఈ ప్రకటన చేయగానే స్టాక్ మార్కెట్లో షేరు కుప్పకూలింది. మరో ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్పై కూడా ప్రభావం పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి వివిధ విభాగాల్లో పనులు ప్రారంభం కాని కాంట్రాక్టుల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆంధప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులను పొందిన కంపెనీల్లో ఎన్సీసీ లిమిటెడ్, జీఎంఆర్ గ్రూప్లు కీలకంగా ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్సీసీ 6,100 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను గత ప్రభుత్వ హయాంలో గెలుచుకుంది.
6,100 కోట్ల ఆర్డర్లపై ఆశల్లేవన్న ఎన్సీసీ..! భారీగా పతనమైన షేరు...!!
అయితే కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ ఆర్డర్లు 41,197 కోట్ల రూపాయల నుంచి 35,097 కోట్ల రూపాయలకు పడిపోతుందని ఎన్సీసీ తెలిపింది కాగా జీఎంఆర్ గ్రూప్...ఈ మధ్యనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. తాజాగా కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్పై దృష్టి సారించటంతో దీని భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకు చెందిన కాకినాడ సెజ్ ఇటీవల పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఏపీజీడీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజ సంస్థలైన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు కూడా ఏపీలో కొన్ని కాంట్రాక్టులను దక్కించుకున్నాయి. మరోవైపు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ఉన్న ట్రాన్స్ట్రాయ్ లిమిటెడ్, నవయుగ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్, శీనయ్య అండ్ కంపెనీ, ఎస్ఇడబ్ల్యూ, ఎంఈఐఎల్.. సంస్థలు పలు కాంట్రాక్టులను చేజిక్కించుకున్నాయి.
ఎన్సీసీ షేరు ఢమాల్..! చిత్తైన మార్కెట్..!!
ఇందులో నవయుగ ఇన్ఫ్రా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపడుతోంది. పోలవరం నిర్మాణ పనులను చేజిక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ లిమిటెడ్.. పనులను సక్రమంగా చేపట్టకపోవటంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పనులను నవయుగ ఇన్ఫ్రాకు అప్పగించింది. పట్టిసీమ ప్రాజెక్టును ఎంఈఐఎల్ పూర్తి చేయగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను చేపడుతోంది. దాదాపు 6,100 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను కోల్పోయే అవకాశం ఉందని ఎన్సీసీ ప్రకటించటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లో షేరు కుప్పకూలింది. శుక్రవారం బీఎ్సఈలో 110 రూపాయల వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో 95.20 రూపాయల స్థాయిని తాకింది. రోజంతా ఆటుపోట్లలో సాగిన ఈ షేరు చివరకు 16.33 శాతం నష్టపోయి 97.85 రూపాయల వద్ద ముగిసింది.
డోలాయమానంలో పలు ప్రాజెక్టులు..! అవకాశాలపై కమ్ముకున్న నీలి నీడలు..!!
మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.82 శాతం నష్టంతో రూ.97.75 వద్ద క్లోజైంది. బీఎస్ఈలో మొత్తం 76,56,140 షేర్లు ట్రేడవగా ఎన్ఎస్ఈలో 9.87 కోట్ల షేర్లు చేతులు మారాయి. శుక్రవారం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు కూడా తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. బీఎస్ఈలో ఆరంభంలో 16 రూపాయల వద్ద మొదలైన ఈ షేరు ఒక దశలో 16.20 రూపాయల స్థాయిని తాకింది. ఆ తర్వాత 15.40 రూపాయల స్థాయిని తాకి చివరకు 2.8 శాతం నష్టపోయి 15.60 రూపాయల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో కూడా కంపెనీ షేరు 3.12 శాతం నష్టంతో 15.50 రూపాయల వద్ద క్లోజైంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, బందరు పోర్టు, అమరావతి ఐకానిక్ బ్రిడ్జి, ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మంజూరు చేసిన పలు కాంట్రాక్టులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.