పవర్ దెబ్బ: GMRకు రూ.2,341 కోట్ల భారీ నష్టాలు
విద్యుత్, మౌలికరంగం, విమానయానం తదితర రంగాల్లో ఉన్న జీఎంఆర్ (GMR) ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం క్వార్టర్ 4లో రూ.2,341 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్ల నికర లాభం ఉండగా, ఈసారి నష్టపోయింది. కొన్ని విద్యుత్ ఆస్తుల విలువ క్షీణించడంతో ఈ నష్టాలు వచ్చాయి. జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జీసీఈఎల్), దీని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లలో కంపెనీ పెట్టుబడుల విలువ క్షీణించడం వల్ల రూ.1,242 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు వెల్లడించింది.
పెన్షన్పై వైయస్ జగన్ గుడ్న్యూస్, ఏడాదికి రూ.250 పెంపు
విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయింపుల వల్ల నష్టం
గత ఆర్థి సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.542 కోట్ల నికర నష్టం కంటే నాలుగో త్రైమాసికంలో నష్టాలు మరింత ఎక్కువగా ఉంది. రాజమండ్రి, చత్తీస్గఢ్ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.2,212 కోట్లకు ప్రత్యేక కేటాయింపులు చేయడంతో నష్టాలు ఎక్కువయ్యాయి. చత్తీస్గఢ్ విద్యుత్ విభాగం రూ.969.58 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. దీంతో రూ.2,212 కోట్లకు చేరుకుంది. క్వార్టర్ 4 ఆదాయం కూడా అంతకు ముందు ఇదేకాలంలో ఉన్న రూ.2,109 కోట్ల కంటే తగ్గి రూ.1,983 కోట్లగా ఉంది. గత ఏడాది పూర్తి కాలానికి జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆదాయం రూ.7,565 కోట్లు. నికర నష్టం రూ.3,466 కోట్ల. అంతకుముందు ఏడాదిలో మొత్తం ఆదాయం రూ.8,721 కోట్లు, నికర నష్టం. రూ.1,083.
లాభాల్లో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్
అదే సమయంలో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ విభాగం ఆదాయం క్రమంగా పెరుగుతోందని, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ఈ విభాగంలో పెట్టుబడులు సంపాదించి ఆస్తి-అప్పుల పట్టీపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ విభాగం మాత్రం రూ.1,357 కోట్ల ఆధాయంపై రూ.271 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రయాణీకుల ట్రాఫిక్ 2018-19లో ఐదు శాతం పెరిగి 69.2 మిలియన్లు, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణీకుల ట్రాఫిక్ 16 శాతం పెరిగి 21.4 మిలియన్లుగా ఉంది.
ఇంధన విభాగంలో పెట్టుబడుల్లేవు
ఇంధన విభాగంలో తమ వాటాదారుల పెట్టుబడుల విలువ తగ్గిందని, అయినా ప్రస్తుత ఇంధన ఆస్తుల సమర్థతను పెంచేందుకు కట్టుబడి ఉన్నామని జీఎంఆర్ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఏరోసిటీ ఎన్సీఆర్ (నేషనల్ కేపిటల్ రీజియన్) ప్రాంతంలో నూతన వ్యాపార జిల్లా కేంద్రంగా పేరు సంపాదిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ విమానాశ్రయంలో దాదాపు ఎనిమిది లక్షల చ.అ. నిర్మాణ స్థలం ఉండేవిధంగా జీఎంఆర్ బిజినెస్ పార్క్ నిర్మిస్తున్నామని తెలిపింది. దీర్ఘకాలిక డాలర్ బాండ్ల ద్వారా ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణకు 650 మిలియన్ డాలర్లు సమీకరించామని తెలిపింది. కాగా, ఇటీవల టాటా గ్రూప్, జీఐసీ సింగపూర్, ఎస్ఎస్జీ కేపిటల్ మేనేజ్మెంట్లో రూ.8,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి చేసుకున్న ఒప్పందంతో జీఎంఆర్ ఇన్ఫ్రా రుణభారం గణనీయంగా తగ్గడమే కాకుండా ఎయిర్ పోర్ట్ వ్యాపారం డీమెర్జింగ్కు మార్గం సుగమం అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సీఎఫ్ఓ తెలిపారు.