రూ.2,500 కోట్లు సమీకరించనున్న తెలంగాణ ప్రభుత్వం
దేశంలో ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ తాజాగా రూ.2,500 కోట్ల నిధులను సమీకరణకు సిద్ధమైంది. దీర్ఘకాలిక వ్యవధి కలిగిన సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలనేది ప్రభుత్వం యోచన. ఎనిమిది సంవత్సరాల కాల పరిమితికి ఈ మేరకు రుణాన్ని పొందనుంది. ఈ దిశగా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని సంప్రదించింది.
ఈ నెల 28వ తేదీన ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం కోసం వేలం నిర్వహించనుంది. ఇందులో పలు సంస్థలు బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా సెక్యూరిటీస్ కొనుగోలు చేస్తాయి. రుణాలపై వడ్డీ రేటును ఆర్బీఐ నిర్ణయించనుంది. సాధారణంగా ఇలాంటి రుణాల్లో 8-10 శాతం వార్షిక వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వాలు సన్నద్ధత వ్యక్తం చేస్తాయి.
బిల్లులు చెల్లించేందుకేనా?
తెలంగాణలో శాసన సభ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పలు రంగాల చెల్లింపులు కలిపి దాదాపు రూ.20,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అంచనా అని విశ్వసనీయ సమాచారం.
మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే..
వృద్ధాప్య పింఛను, రైతులకు రైతు బంధు పథకంలో భాగంగా వేల కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉందట. అయితే రెండు మూడు నెలలుగా ఎన్నికల నియమావళి అమలులో ఉండటం వల్ల అన్ని రకాల చెల్లింపులకు కాస్త సమయం దొరికింది. కానీ ఇప్పటికే ఎన్నికల సంఘం మోడల్ కోడ్ను ఎత్తివేసింది. దీంతో వచ్చే నెల నుంచి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.2,500 కోట్ల సెక్యూరిటీలు విక్రయించడం ద్వారా ఆ మేరకు రుణాలను సమీకరించి, అత్యవసరమైన చెల్లింపులు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెలాఖరు నాటికి రూ.2,500కోట్లు సమకూరుతాయని అంచనా.