మోడీ గెలుపు: ప్రజల్ని ఆకట్టుకున్న స్కీంలు ఇవే
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అద్భుత విజయం సాధించింది. 2014 కంటే 21 సీట్లు ఎక్కువగా గెలవడం ద్వారా ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం సన్నగిల్లలేదని తేలిపోయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి పథకాలతో తాత్కాలికంగా ఇబ్బందులు కలిగినా భావి భారతానికేనని ప్రజలు అర్థం చేసుకున్నారని చెబుతున్నారు. మోడీ గత అయిదేళ్లలో తీసుకువచ్చిన పలు స్కీంలు కూడా గెలుపుకు తోడ్పడ్డాయని భావిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం...
మీ పర్సనల్ ఫైనాన్స్పై ఎలా ప్రభావం పడుతుంది?
జన్ ధన్ యోజన
ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని, సమ్మిళిత ఆర్థిక కార్యకలాపాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం తీసుకొచ్చిందే జన్ ధన్ యోజన. ఇప్పటి దాకా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇందులో జమ అయ్యాయి. 35 కోట్ల మంది అకౌంట్ ప్రారంభించారు. స్వయం ఉపాధి పథకాలకు జన్ ధన్ అకౌంట్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
విద్యుత్ సౌకర్యం
దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోంది. దీనిని సౌభాగ్య స్కీం లేదా ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అంటారు. ఈ ప్రాజెక్టును 2017లో లాంచ్ చేశారు. ఈ స్కీం కింద గ్రామీణ ప్రాంతాల గృహ సముదాయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. రెండున్నర కోట్ల ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించారు.
ఉజ్వల్, బీమా పథకాలు
మహిళలను వంట పొయ్యి పొగబారి నుంచి కాపాడేందుకు ఉజ్వల్ స్కీం తీసుకు వచ్చారు. దీంతో ఏడు కోట్ల మందికి పైగా సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తున్నారు. గ్రామీణ నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం తెచ్చిన స్కీం గ్రామీణ ఆవాస్ యోజన. దీంతో రెండు కోట్ల మందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరింది. అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్, ఇతర బీమా పథకాలు ఆకట్టుకున్నాయి.
ఆయుష్మాన్ భారత్, కిసాన్ స్కీం
కొద్ది రోజుల నెలల ప్రధాని నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ స్కీం తీసుకు వచ్చారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకం. ఆయుష్మాన్ భారత్ (PMJAY) లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం అంటారు. ఈ స్కీం ద్వారా పది కోట్లకు పైగా కుటుంబాలకు అంటే దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఆ తర్వాత ఇటీవల పీఎం కిసాన్ స్కీం తీసుకు వచ్చారు. అయిదు ఎకరాలున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం తీసుకు వచ్చారు. ఏడాదికి రూ.6వేలు వారి ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతోంది.