వాహనదారులకు షాక్, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం 15 శాతం పెంపు: ఏ కారు, ఏ బైక్కు ఎంత అంటే?
వాహనదారులకు షాక్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియంను 15 శాతం పెంచేందుకు బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (irdai) సిద్ధమైంది. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి కచ్చితంగా థర్డ్ పార్టీ బీమా ఉండాల్సిందే. ఈ బామా ప్రీమియాన్ని పెంచేందుకు irdai ప్రతిపాదనలు చేసింది. దీంతో పాత కార్లు, బైక్స్తో పాటు వాణిజ్య వాహనాలకు ఈ పెంపు వర్తిస్తుందని, అందుకు సంబంధించి డ్రాఫ్ట్ పత్రాన్ని విడుదల చేసింది.
ఎన్నికల మరుసటి రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఏ కారుకు, ఏ బైక్కు ఎంత ప్రీమియం పెరుగుతందంటే?
1000 సీసీ సామర్థ్యం కలిగిన కారుపై చెల్లించే థర్డ్ పార్టీ ప్రీమియంను రూ.1,850 నుంచి రూ.2,120 పెంచాలని భావిస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించింది. అలాగే 1000 నుంచి 1,500 సీసీ కార్లపై కూడా ప్రీమియాన్ని రూ.2,863 నుంచి రూ.3,300కు పెంచనుంది. 1,500 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ విలాసవంతమైన కార్లకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం వీటిపై రూ.7,890గా ఉంది. బైక్స్కు 75సీసీ లోపు ప్రీమియాన్ని రూ.427 నుంచి రూ.487కు, 45-150 సీసీ బైక్స్పై రూ.720 నుంచి రూ.752, 150-350 సీసీ బైక్స్పై రూ.985 నుంచి రూ.1,193, 350సీసీకి పైన ఉన్న బైక్స్పై మాత్రం రూ.2,323 ఉండగా, అదే కొనసాగించనుంది.
29 వరకు అభ్యంతరాల స్వీకరణ
సహజంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈసారి మాత్రం నెల రోజుల తర్వాత కొత్త ముసాయిదా పాలసీని ప్రకటించింది. ఈ నూతన పాలసీ డ్రాఫ్ట్ మీద మే 29 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని irdai నిర్ణయించింది. ఇప్పటి వరకు గత ఆర్థిక సంవత్సరం ప్రీమియంలే వర్తించాయి. తాజాగా, ఈ రేట్లను మార్చాలని irdai ప్రతిపాదించింది.
కొత్త కార్లకు, బైక్లకు పెంపులేదు
కొత్త కొన్న కార్లకు మూడేళ్ల పాటు, బైక్లకు అయిదేళ్ల పాటు వర్తించే థర్డ్ పార్టీ పాలసీ ప్రీమియాన్ని ప్రస్తుతం మార్చలేదు. కొత్త కార్లకు 1000 సీసీ లోపు రూ.5,286, 1000-1500 సీసీ అయితే రూ.9,534, 1500 సీసీకి పైన రూ.24,305 ఉంది. బైక్స్ అయితే 75 సీసీలోపు రూ.1,045, 75-150 సీసీ రూ.3,285, 150-350 సీసీ రూ.5,453, 350సీసీ పైన అయితే రూ.13,034 ఉంది. ఇవే కొనసాగనున్నాయి.
విద్యుత్ వెహికిల్స్కు 15 శాతం రాయితీ
అదే సమయంలో విద్యుత్ వెహికిల్స్కు సంబంధించి థర్డ్ పార్టీ పాలసీ ప్రీమియంలో 15 శాతం రాయితీని ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ-రిక్షాలపై ప్రీమియంను వడ్డించే ప్రతిపాదన లేదని చెప్పింది. స్కూల్ బస్, ట్యాక్సీ, ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులకు వర్తించే థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు కూడా పెరుగుతాయి. 29వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అప్పుడు కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. మరోసారి నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు పాత ప్రీమియంను కొనసాగిస్తున్నట్లు irdai ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్సురెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (IIBI) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా IRDAI మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను నిర్ణయిస్తుంది. 2011-12 నుంచి 2017-18 మధ్య ప్రమాదాల బారిన పడిన చాలామంది క్లెయిమ్ చేసుకున్నారు.