హువావేకు అమెరికా స్వల్ప ఊరట, బ్యాన్పై 90 రోజుల సడలింపు
అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. పరస్పరం టారిఫ్ల యుద్ధం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షులు డొనాల్ట్ ట్రంప్ చైనా దిగ్గజ సంస్థ హువావేపై ఇటీవల కఠిన ఆంక్షలు విధించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎలాంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదని తెలిపింది. అనంతరం గూగుల్ కూడా హువావేకు షాకిచ్చింది. దీంతో గూగుల్ మ్యాప్స్, జీమెయిల్ సహా వివిధ యాప్స్ హువాయ్ ఫోన్లలో పని చేయవు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు అందించమని గూగుల్ తెలిపింది. ఈ నేపథ్యంలో హువాయ్ కూడా ఇప్పుడు యాండ్రాయిడ్కు ప్రత్యామ్నాయాలను వెతికే వేటలో పడిందట.
ట్రంప్ సంచలన నిర్ణయం, అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ: చైనీస్ హువావేపై నేరుగా యుద్ధం
ఇదిలా ఉండగా, హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటన వెలువరించింది. ఈ నిర్ణయంతో హువావేకు కాస్త ఊరట లభించింది. అయితే హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని ట్రంప్ విధించిన నిషేధంలో ఎలాంటి మార్పు ఉండదని వాణిజ్య విభాగం తెలిపింది. అమెరికా సంస్థలతో వాణిజ్యం కొనసాగించేందుకు హువావేకు తాత్కాలికంగా మాత్రమే లైసెన్స్ ఇస్తున్నట్లు తెలిపింది.
అమెరికాలోని టిలికం ఆపరేటర్లు కీలక సేవల కోసం హువావే పరికరాలు వినియోగిస్తున్నందున ఆయా కంపెనీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు 90 రోజులు సడలించినట్లు పేర్కొంది. తాత్కాలిక లైసెన్స్ వల్ల హువావే ఫోన్ల వినియోగదారులకు సేవలు కొనసాగడంతో పాటు గ్రామీణ బ్రాండ్ నెట్ వర్క్ సేవలు అందించే అవకాశం ఏర్పడుతుంది.
ఈ సడలింపుపై హువావే వ్యవస్థాపకులు రెన్ జెంగ్ఫీ మాట్లాడుతూ... ప్రస్తుతం అమెరికా చర్యల వల్ల హువావే 5జీ నెట్ వర్క్ పైన ఎలాంటి ప్రభావం పడదని, హువావే స్థాయి టెక్నాలజీని అందుకోవాలంటే ఇతర సంస్థలకు రెండు మూడేళ్లు పడుతుందని, హువావాపై అమెరికా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలించినా ఆ ప్రభావం ఉంటుందని తాము అనుకోవడం లేదని చెప్పారు. తాము అన్నింటికి సిద్ధమన్నారు. అమెరికా చర్యలతో తాము ఏకాకిగా మిగిలిపోయామన్నారు.
అంతకుముందు, గూగుల్ సేవలు నిలిపివేస్తానని ప్రకటించడంపై కూడా రెన్ జెంగ్ ఫీ ఆగ్రహించారు. తమను తక్కువగా అంచనా వేయవద్దన్నారు. తమ బలాన్ని తక్కువగా అంచనా వేసి, అమెరికా రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.