వాహన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ లాభాల్లో 49 శాతం తగ్గుదల నమోదు
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మార్కెట్లలో జోష్ కనిపించింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. సెన్సెక్స్ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. భాజపా కూటమి మరో సారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రూపాయి విలువ కూడా బలపడింది. బ్యాంకింగ , ఆటోమొబైల్ షేర్లు సోమవారం ట్రేడింగ్ను నడిపించాయి. ఇక బ్యాంకింగ్లో నిఫ్టీ 4శాతం లాభపడగా ఆటో ఇండెక్స్ కూడా 4శాతం లాభాన్ని రికార్డు చేశాయి.
ఇదిలా ఉంటే వాహన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ నాలుగో క్వార్టర్లో ఆ కంపెనీ ప్రకటించిన లాభాల్లో దాదాపు 49శాతం తగ్గుదల నమోదైంది. ఈ త్రైమాసికానికి నికర లాభం రూ.1,108 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికానికి రూ.2,175 కోట్ల నికర లాభం రికార్డు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.86,422 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఇదే సీజన్లో రూ.89,928 కోట్ల ఆదాయం లభించింది. నిర్వహణ లాభం రూ.8,449.5 కోట్లు, మార్జిన్ 9.8శాతంగా నమోదైంది.
జేఎల్ఆర్ పన్ను చెల్లించకముందు 269 మిలియన్ పౌండ్ల లాభాన్నిగడించినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27.1శాతం తక్కువ. జేఎల్ఆర్ ఆదాయం 7,134 మిలియన్ పౌండ్లుగా నమోదైంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడారు. మార్కెట్లలో ప్రస్తుతం సమస్యలు నెలకొన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. నష్టాలు వచ్చినప్పటికీ నాణ్యతలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ రాజీపడబోమని ఆయన అన్నారు. మార్కెట్షేర్ను, లాభాలను తిరిగి సంపాదించుకుంటామని ఆయన అన్నారు. నేటి ట్రేడింగ్లో టాటా మోటార్స్ షేరు ధర రూ.13.30 పెరిగి రూ.190 వద్ద ముగిసింది.