మహానగరాల్లో 'హైదరాబాద్' చౌక: అందుకే ఇల్లు కొనుగోళ్లకు సై!
హైదరాబాద్: దశంలోని మహానగరాలన్నింటిలోకి మన హైదరాబాదులోనే ఇండ్ల ధరలు చౌకగా ఉన్నాయట. అందుకే వందలో అరవై మందికి పైగా ఇక్కడ తప్పనిసరిగా ఇల్లు కొనుగోలు చేస్తున్నారట. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అన్రాక్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది.
గత రెండేళ్లలో దాదాపు 20 శాతం వరకు హైదరాబాదులో ధరలు పెరిగాయి. అయినప్పటికీ, కొనుగోలు మాత్రం తగ్గలేదు. పైగా గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఒక్క హైదరాబాదులోనే కాకుండా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో భూములు, ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరగడం ఈ ట్రెండ్ను స్పష్టం చేస్తోంది.
హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభం తర్వాత శివార్లలో రియల్ పరుగులు స్పష్టంగా కనిపిస్తోంది. పోచారం, బాచుపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో అత్యధిక వేగం కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ హైదరాబాద్ ధరలు తక్కువ అన్నాం కానీ ఎంతో చెప్పలేదు కదా. మన భాగ్యనగరంలో సగటు ధర రూ.4,170/చ.గ. పలుకుతుందని, అదే సమయంలో ఇతర నగరాల్లో ఇది రూ.6,000 ఉందట.
కాగా, హైదరాబాద్ శివార్లలో రూ.2,500 కనీస నుంచి కూడా ధరలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, పుణే, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో సగటు ధరలు హైదరాబాద్ కంటే అధికంగా ఉంటున్నాయట. అందుకే అక్కడ 100 మందిలో 50 మంది కంటే తక్కువ మంది ఇల్లు కొనాలని అనుకొని కొనుగోలు చేయలేకపోతున్నారట.
ఏడాది కాలంగా అధిక ధరలు, ఆర్థిక రంగంలో నెలకొన్న అనిశ్చితి వల్ల మిగతా మహా నగరాల్లో అమ్మకాలు నెమ్మదించినా ఒక్క హైదరాబాదులో మాత్రం వేగంగా దూసుకెళ్తోంది. ఇటీవలే ఆఫీస్ స్పేస్ లీజింగ్లో మన మహానగరం మొట్టమొదటిసారి బెంగళూరును సైతం అధిగమించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తుని మరింత పటిష్టం చేస్తోంది. సో.. ఇంకెందుకు ఆలస్యం ధరలు మరింత పెరగకముందే ఓ ఇంటివారవ్వండి.