చికెన్ ధరలకు రెక్కలు... రూ.200 దాటిన కిలో ధర
ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో కోడి మాంసం రూ.200 దాటి వినియోగదారులకు చుక్కలు చూపుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చికెన్ కొనుగోలుకు వెనుకాడే పరిస్థితి తలెత్తుతోంది. అయితే ఎండలు మనుషులనే కాకుండా అన్ని ప్రాణులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇందుకు కోళ్లు అతీతమేమీ కాదు.
తీవ్రతరమైన ఎండల వల్ల కోళ్ల మరణాల రేటు అధికంగా ఉంటోందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. వంద కోళ్లలో సగటున 12-15 కోళ్లు మృత్యువాత పడుతున్నాయట. దీంతోపాటు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు సైతం దాణాకు బదులు అధికంగా నీటిని తీసుకొంటుడటంతో బరువు తూగడం లేదని పౌల్ట్రీ రైతులు వివరించారు.
తద్వారా, మార్కెట్లోకి సాధారణం కంటే దాదాపు 10-15 శాతం తక్కువ కోడి మాంసం వస్తోంది. మరోవైపు వినియోగదారులు సైతం ఎండాకాలంలో కోడి మాంసం వినియోగించడం వల్ల వేడి చేస్తోందని భావిస్తారు. అందుకే రిటైల్ అమ్మకాలు సైతం నెమ్మదించాయి. ఈ కారణాలతో కోడి మాంసం ధరలు కిలోకు రూ.200 పైగా పలుకుతోందని పౌల్ట్రీ వ్యాపారులు అన్నారు.
బుధవారం (15/05/2019) నాడు వెంకోబ్ చికెన్ ధరలు కిలో స్కిన్తో అయితే రూ.186, స్కిన్వెస్ తోలు లేకుండా రూ.211 చొప్పున విక్రయిస్తోంది. మరో బడా పౌల్ట్రీ కంపెనీ సుగుణ చికెన్ ధరలు సైతం రూ.180, రూ.211 పలుకుతున్నాయి. రిటైల్ విక్రయాల్లో 90 శాతం స్కిన్లెస్ (211) వినియోగమే ఉంటుంది.
అయితే పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో మాతరం ఎక్కువ మొత్తంలో చికెన్ వినియోగం ఉంటోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒక్కటే అటు రైతులకు, ఇటు వ్యాపారులకు కొంత ఊరటనిచ్చే అంశం. రుతుపవనాల రాక, ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైతే జూన్ చివరి నాటికి ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని పౌల్ట్రీ ఫెడరేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.