నేను మళ్లీ గెలిస్తే వరస్ట్: చైనాకు ట్రంప్ హెచ్చరిక, డ్రాగన్ దేశానికి చుక్కలు
ఇక నుంచి చైనా ఉత్పత్తులపై మన ఆధారపడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చాడు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 10 నుంచి 25 శాతానికి పెరిగాయి. దీంతో 300 బిలియన్ డాలర్ల చైనా ఎగుమతులపై ప్రభావం పడనుంది. చైనా నుంచి దిగుమతులపై ఆధారపడ్డ అమెరికన్ కంపెనీలకు కూడా ఇది భారం కానుంది. ట్రంప్ నిర్ణయం అమెరికాపై నెగిటివ్ ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఎయిరిండియా బంపరాఫర్, లాస్ట్ మినట్ ఫ్లైట్ బుకింగ్పై
నేను రెండోసారి గెలిస్తే.. చైనాకు ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ శనివారం చైనాకు హెచ్చరికలు జారీ చేశాడు. తమ దేశంతో (అమెరికా) చైనా ట్రేడ్ డీల్ ఇప్పుడే కుదుర్చుకోవాలని లేదా తాను రెండో టర్మ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రిమెంట్ అంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు. చైనా తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల తర్వాత అమెరికాతో డీల్ కుదుర్చుకుందామని భావిస్తున్నట్లుగా ఉందని, 2020లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తుందేమో, అప్పుడు తమకు లక్ కలిసి వస్తుందేమోనని చైనా భావిస్తోందని ట్రంప్ ట్వీట్ చేశాడు. తాను రెండో టర్మ్ గెలిస్తే చైనాతో వాణిజ్య ఒప్పందం వరస్ట్గా ఉంటుందన్నాడు. నేను గెలుస్తానని వారికి (చైనా) తెలుసునని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అమెరికా చరిత్రలో బెస్ట్ ఎకానమీ, బెస్ట్ నెంబర్ ఉద్యోగాలు, మరెన్నో చేసినట్లు పేర్కొన్నారు. నా రెండో టర్మ్లో ఒప్పందం అయితే మాత్రం వరస్ట్గా ఉంటుందన్నాడు. కాబట్టి ఇప్పుడే చర్చలు జరిపి ముందుకు వెళ్లడం వారికి మంచిదని చెప్పాడు.
అన్ని ఉత్పత్తులపై అధిక టారిఫ్కు ట్రంప్ ఆదేశం
చైనా నుంచి దిగుమతి అయ్యే పలు రకాల ఉత్పత్తులపే ఇప్పటికే టారిఫ్ పెంచిన అమెరికా మిగిలిన ఉత్పత్తులకూ టారిఫ్ పెంపును వర్తింప చేయాలని నిర్ణయించింది. చైనా మిగిలిన దిగుమతులపై సుంకం పెంచాలని ట్రంప్ ఆదేశించాడు. వాణిజ్య యుద్ధానికి ముగింపి ఇచ్చే ఉద్దేశ్యంతో ఇరు దేశాల మధ్య జరిగిన తాజా చర్చలు ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగిశాయి. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ దూకుడుతో అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతంగా ఉన్న సుంకాలను శుక్రవారం నుంచి 25 శాతానికి ట్రంప్ పెంచాడు. ఈ క్రమంలో చైనా నుంచి వస్తున్న దాదాపు అన్ని వస్తూత్పత్తులపై సుంకాలు వేయాలని ట్రంప్ నిర్ణయించడం గమనార్హం. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన
అమెరికాతో సంప్రదింపులు ఇంకా ముగియలేదని చైనా చెబుతున్నప్పటికీ, ఇటీవల విఫలమైన చర్చలను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ మాత్రం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చైనా కూడా ప్రతీకార సుంకాలకు దిగే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే అమెరికా - చైనా టారిఫ్ పోరు ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని భావిస్తున్నారు.
ట్రంప్ దెబ్బతో చైనాకు చుక్కలు
ట్రంప్ తాజా నిర్ణయంతో 200 బిలియన్ డాలర్ల నుంచి 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. వీటిపై అదనపు టారిఫ్ పడనుంది. దీంతో అమెరికాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే చైనాకు అమెరికా చేసే ఎగుమతులు 120 బిలియన్ డాలర్ల లేదా అంతకు లోపు మాత్రమే. వాటిలో ఇప్పటికే 91 శాతంపై టారిఫ్ ఉంది. కాబట్టి అమెరికాకు పెద్దగా నష్టం లేదు. కానీ చైనా మాత్రం ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. టారిఫ్ల పరిధిలోకి రాకుండా మిగిలిన 300 బిలియన్ డాలర్ల వస్తువులపై కూడా 25 శాతం సుంకాలు విధించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలు వారం రోజుల్లో తెలియనున్నాయి.
చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
ట్రంప్ నిర్ణయంతో చైనా కూడా అమెరికా వస్తువులపై మరింత టారిఫ్ విధించే అవకాశాలు కొట్టిపారేయలేం. కానీ ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తే చైనాకే నష్టం. అలాగే, చైనాలో పని చేసే అమెరికా కంపెనీలను నిబంధనలు, కస్టమ్స్, తనిఖీల పేరుతో చైనా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ అలా చేస్తే చైనా వృద్ధి రేటు దెబ్బతినే అవకాశముంది. అప్పుడు మరేదేశం చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించదు. ఇప్పటికై చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందకోడిగా తయారయింది. దాదాపు గత మూడు దశాబ్దాలలో ఎన్నడు లేని తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది. మరోవైపు, చైనా అప్పులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గట్టి దెబ్బ తగిలితే చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో చైనా వృద్ధి 1.2 శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ దెబ్బతో చైనా స్టాక్ సూచీలు కూడా నాలుగు శాతం కూలాయి.