ఐపీఎల్ తర్వాత ప్రపంచ కప్: భారత్ నుంచి ఇంగ్లాండ్కు 80 వేలమంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు రోజుల్లో ముగియనుంది. క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ప్రపంచ కప్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రపంచ కప్ కోసం భారత్ నుంచి పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్ తరలి వెళ్లనున్నారు. మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు వరల్డ్ కప్ ఉంది. ఈ రోజుల్లో భారత్ నుంచి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారని ట్రావెల్ పోర్టల్స్, టూర్ ఆపరేటర్స్ భావిస్తున్నారు. ట్రావెల్ బిజినెస్కు క్రికెట్ సీజన్ మంచి లాభదాయకమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఉన్న రోజుల్లో 35 శాతం ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్లో భారత్ సత్తా చాటితే మాత్రం మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి.
నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!
క్రికెట్ సంబరం
ప్రపంచ కప్లో భారత్ మ్యాచ్లు జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నర రోజులు ఉండే క్రికెట్ సంబరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులతో పాటు కార్పోరేట్ సంస్థలు వెళ్తున్నాయి. ఈసారి జరిగే మ్యాచ్లు చూసేందుకు సుమారు 80,000 మంది ఫ్యాన్స్ తరలి వెళ్లనున్నారట. ఇండియా-ఇంగ్లాండ్ ట్రావెల్ ట్రెండ్స్, భారత్లోని ట్రావెల్ ఏజెన్సీలు లెక్కలు చూస్తే ఇంతమంది వెళ్లనున్నారట. ప్రపంచ కప్ కోసం వెళ్లే అభిమానుల్లో భారతీయులే ఎక్కువ మంది ఉంటారని అంచనా.
భారత్ - పాక్ మ్యాచ్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు మరింత డిమాండ్ ఉంటుంది. ఈ మ్యాచ్కు ఇరు దేశాల నుంచి అభిమానులు తరలి వెళ్లే అవకాశముంది. దాయాదుల మధ్య జూన్ 16వ తేదీన మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరగనుంది. ఇండియా-ఆస్ట్రేలియా, ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్లు కూడా అభిమానులను అలరించనున్నాయి. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్లో జూలై 14వ తేదీన ఉంది.అదే రోజున ఇంగ్లాండ్లోనే వింబుల్డన్ మెన్ టెన్నిస్, ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్ ఉన్నాయి.
సమ్మర్కు ప్రపంచ కప్ తోడు
సమ్మర్కు ప్రపంచ కప్ తోడు కావడంతో యూకేకు 35 శాతం మంది ఎక్కువగా క్రీడాభిమానులు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కాక్స్ అండ్ కింగ్స్ రిలేషన్షిప్స్ హెడ్ కరన్ ఆనంద్ అన్నారు. జూన్ 16 పాక్ - భారత్ మ్యాచ్ కోసం అధిగ డిమాండ్ ఉంటుందని థామస్ కుక్ తెలిపింది. 2018 సెప్టెంబర్ ముగిసే ఏడాదికి దాదాపు 5.15లక్షల మంది భారతీయులు యూకేను సందర్శించారు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఇది మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే జనవరి నుంచి ఏప్రిల్ లోపు దాదాపు రెండు లక్షల వీసా దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.