మరో మూడు బ్యాంకుల విలీనానికి ముహూర్తం!
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో మహా విలీనానికి తెరలేవనుంది. మరో మూడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల (పీఎస్బీ) విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయ బ్యాంకు, దేనా బ్యాంకులు విలీనమయ్యాయి. ఎస్బీఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులు అంతకుముందు కలిపేశారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఒక్కటి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ మేరకు కేంద్రఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సంకేతాలు వచ్చాయి. బ్యాంకింగ్ రంగంలో మరో దఫా విలీనాలపై చర్చించేందుకు ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు పిలుపు రావచ్చనని జాతీయ వార్తా పత్రికతో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అది పీఎన్బీ, యూబీఐ, బీవోఐ కావొచ్చునని అంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం లేదా మూడో త్రైమాసికంలో అంటే జూలై-సెప్టెంబర్ లేదా అక్టోబర్-డిసెంబర్లోగా బ్యాంకుల విలీనానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ప్రతి సమస్యకు విలీనం పరిష్కారం కాదని కొందరు సీనియర్ ఉద్యోగులు భావిస్తున్నారు. మొండి బకాయిలు (ఎన్పీఏ) బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో విలీనాలతో సమస్యకు చెక్ పెట్టవచ్చునని కేంద్రం భావిస్తోంది. ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకొని దానిని సక్రమంగా చెల్లించకుంటానే మరో బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్న అక్రమార్లకు అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు 1894లో ప్రారంభమైంది. ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. సీఎండీ సునీల్ మెహతా. మొత్తం ఆశ్తులు రూ.7,65,830 కోట్లు. 70వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 7వేలకు పైగా శాఖలు ఉన్నాయి. 10వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో ప్రారంభమైంది. ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. బ్యాంక్ సీఎండీ దీనబంధు మహాపాత్ర. ఈ బ్యాంకు ఆస్ులు రూ.6,09,913 కోట్లు ఉన్నాయి. 45వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 5వేలకు పైగా శాఖలు, 7వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి.
యూనియన్ బ్యాంకు 1919లో ప్రారంభమైంది. దీని కార్యాలయం ముంబైలో ఉంది. సీఎండీ రాజ్ కిరణ్ రాయ్. రూ.4,04,695 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 35 మందికి వేలకు పైగా ఉద్యోగులు, 4వేలకు పైగా శాఖలు, 4వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి.