అది వ్యాపార నష్టం, నా ఒక్కడి పైనే ఎందుకిలా: బ్యాంకులకు విజయ్ మాల్యా
లండన్: బ్యాంకుల నుంచి వేలకోట్లు లోన్ తీసుకొని, లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా జెట్ ఎయిర్వేస్ అంశంపై మరోసారి స్పందించాడు. ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో రెండు ట్వీట్లు చేశాడు. నేను టీవీ డిబేట్లో చూశానని, జెట్ ఎయిర్వేస్ కూలిపోవడం గురించి, జెట్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంపై విన్నానని పేర్కొన్నాడు. నిరుద్యోగం, సెక్యూరిటీ అవలెబుల్, పునరుద్ధరణ అవకాశాలు తదితర విషయాలు చూశానని పేర్కొన్నాడు. తాను మాత్రం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లోన్లను 100 శాతం చెల్లిస్తానని ఆఫర్ చేసినా బ్యాంకులు తీసుకోవడం లేదని, ఎందుకో చెప్పాలని ట్వీట్ ద్వారా ప్రశ్నించాడు.
జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి ఆత్మహత్య
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సహా పలు ఇండియన్ ఎయిర్ లైన్స్ అర్ధాంతరంగా నష్టాలబాటలో కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఇప్పుడు గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా జెట్ ఎయిర్వేస్ పతనమైందని చెప్పారు. ఇవి వ్యాపార వైఫల్యాలు అన్నాడు. కానీ తాను 100 శాతం చెల్లిస్తానని చెప్పినప్పటికీ సీబీఐ/ఈడీలు తనపై క్రిమినల్ కేసులు పెట్టాయని వాపోయాడు. నా ఒక్కడి పైనే ఎందుకు ఇలా, ఆశ్చర్యం వేస్తోందని వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉండగా, జెట్ ఎయిర్వేస్ సంక్షోభం సద్దుమణగకముందే హెలికాప్టర్ సేవలు అందించే పవన్ హాన్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఏప్రిల్ నెలకు ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే స్థితిలో కంపెనీ లేదని యాజమాన్యం ఉద్యోగులకు సర్క్యులర్ ద్వారా తెలిపింది. కంపెనీ మొత్తం పనితీరును సమీక్షిస్తే ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, పరిశ్రమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, బిజినెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం క్షీణించిందని తెలిపింది. రూ.89 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం వ్యాపార పరిమాణం, వ్యయాలకు పొంతన లేకుండా ఉందని, ముఖ్యంగా ఉద్యోగుల వేతనాలు భారంగా మారాయని పేర్కొంది. సంస్థ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని బకాయిల్లో అరవై శాతం తిరిగి వచ్చే వరకు ఏప్రిల్ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేయాలని నిర్ణయించామని పేర్కొంది.