Waterless bath: నీరు లేకుండా ఇలా స్నానం చేయండి, క్లెన్స్టా ధర, ఉపయోగం ఎలా అంటే?
నీటి అవసరం లేకుండా శరీరాన్ని శుభ్రపరిచే ఉత్పత్తుల తయారీ సంస్థ క్లెన్స్టా తెలంగాణ రాజధాని హైదరాబాదులో యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధమైంది. రూ.35 కోట్లతో (దాదాపు 5 మిలియన్లు) ఈ యూనిట్ ప్రారంభించనుంది. దీంతో వంద మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెబుతున్నారు. హైదరాబాదులో క్లెన్స్టా యూనిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో పునీత్ గుప్తా తెలిపారు.
బిల్డింగ్ టెర్రాస్పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చు
క్లెన్స్టాను శరీరంపై స్ప్రే చేసుకొని, రుద్ది, టవల్తో తుడుచుకోవాలి
క్లెన్స్టా తెలంగాణ, ఏపీలలో బుధవారం తమ ఉత్పత్తులను విడుదల చేసింది. నీటి అవసరం లేకుండా స్నానం, షాంపూలకు రెండు రాష్ట్రాల నుంచి మంచి గిరాకీ ఉందని, అందుకే ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. వీటిని జుట్టు, శరీరంపై స్ప్రే చేసుకొని, ఆ తర్వాత రుద్ది, టవల్తో తుడుచుకుంటే సరిపోతుందని తెలిపారు. సైనికులు, ఆసుపత్రుల్లో చేరినవారు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. నడవలేనిస్థితిలోని వృద్ధులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు.
వీటి ధర ఎంత అంటే?
100 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఉత్పత్తితో ఏడు నుంచి ఎనిమిదిసార్లు శుభ్రం చేసుకునేందుకు వీలవుతుందని ఆయన వెల్లడించారు. వీటి ధర రూ.499, రూ.549గా ఉందన్నారు. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ భారత్లోనే కాకుండా, బ్రిటన్, సౌదీ అరేబియా, కువైట్ సహా 29 దేశాలకు క్లెన్స్టా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోన్నట్లు తెలిపారు. కంపెనీ టర్నోవర్ రోజు రోజుకూ పెరుగుతోందని వెల్లడించారు. ఇండియాలో గత ఏడాది ఐదు మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉండగా, ఈ ఏడాది అది పది మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. క్లెన్స్టా ఉత్పత్తులు ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తాయని ఆయన వెల్లడించారు. సమీప భవిష్యత్తులో మరికొన్ని కొత్త రకమైన ఉత్పత్తులు తీసుకు వస్తామని తెలిపారు. నీటి అవసరంలేని టూత్పేస్ట్, దోమలు కుట్టకుండా నిరోదించే బాడీబాత్ వంటి వాటిని మరో ఆరు నెలల్లో తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ తమ ఉత్పత్తులను ఆసుపత్రుల్లో, ఆర్మ్డ్ ఫోర్స్కు, అడ్వెంచర్స్, రైల్వే ట్రావెల్లర్స్ తదితరులకు విక్రయిస్తోంది.
దక్షిణాది నుంచి స్పందన
తెలంగాణలో 35 కోట్ల రూపాయలతో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమయ్యామని, దీంతో చాలామందికి ఉద్యోగాలు వస్తాయని పునీత్ చెప్పారు. దక్షిణాది నుంచి మంచి స్పందన ఉందని, అందుకే హైదరాబాదులో యూనిట్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. 12 నుంచి 15 నెలల సమయంలో దీనిని తీసుకు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న యూనిట్ సామర్థ్యం రోజుకు 2లక్షలు. ఈ ఉత్పత్తుల్లో సగం దేశీయంగా విక్రయిస్తుండగా, మిగతావి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాపారాన్ని నిర్వహించడానికి 2 నుంచి 3 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలోగా మరో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమన్నారు. కాగా, ఈ వాటర్లెస్ బాత్, షాంపూలు ఏడాది క్రితం మార్కెట్లోకి వచ్చాయి.