మోడీకి ఝలక్: అనిల్ అంబానీపై అటాక్.. ఐనా కాంగ్రెస్కు ముఖేష్ అంబానీ మద్దతు
ముంబై: రాఫెల్ డీల్ విషయమై అనిల్ అంబానీ, బీజేపీపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. మరోవైపు, అనిల్ సోదరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు! 2019 సార్వత్రిక ఎన్నికలు వాడిగా వేడిగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై దక్షిణ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరకు ముఖేష్ అంబాని మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది.
జియో హవా, బీఎస్ఎన్ఎల్కు పెరిగిన కస్టమర్లు
అలాంటి ముఖేష్ ఎవరికి మద్దతిచ్చినా హాట్ టాపికే
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేష్ దేశంలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల్లో ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందమంది అత్యంత ప్రభావశీలురతో టైమ్ మేగజైన్ రూపొందించిన లిస్టులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక భారతీయ పారిశ్రామికవేత్త. అలాంటిది ముఖేష్ ఎవరికి మద్దతిచ్చినా అది చర్చనీయాంశంగానే ఉంటుంది. ముఖేష్ కాంగ్రెస్ నేత మిలింద్ మురళీ దేవరాకు మద్దతు ప్రకటించారు. ముఖేష్ అంబానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం హాట్ టాపిక్గా మారింది.
తమ్ముడికి అండగా అన్న
అనిల్ అంబానీకి డబ్బులు మిగిల్చేందుకే ప్రధాని మోడీ రాఫెల్ విమానాలకు అధిక ధర చెల్లిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణలను గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అనిల్కు మోడీ మధ్యవర్తిగా వ్యవహరించారని, దేశ రక్షణ వ్యవహారాల్లో రహస్యంగా ఉంచాల్సిన సున్నితమైన అంశాలను రాజీపడి ఇతరులకు చేరవేశారని, దీనికి మోడీ శిక్ష అనుభవించాల్సిందేనని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్న ముకేశ్ అంబానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం గమనార్హం. ఇటీవలే ముఖేష్.. తన తమ్ముడు అనిల్ అంబానీకి రూ.400 కోట్లు ఇచ్చి ఎరిక్సన్ కేసులో జైలుకు వెళ్లకుండా రక్షించారు.
|
ముఖేష్ అంబానీ మొదలు
మిలింద్ సౌత్ ముంబైకి చెందిన వ్యక్తి అని, ఆయనకు ఈ ప్రాంతపు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై పరిపూర్ణమైన అవగాహన ఉందని ముఖేష్ అంబానీ ఒక వీడియోలో చెప్పారు. ఈ వీడియోను మిలింద్ మురళీ దేవర తన ట్విటర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. చిరు వ్యాపారుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు.. తనకు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ముంబైకి బిజినెస్ను తిరిగి తీసుకు వచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించడం టాప్ ప్రియారిటీ అని మిలింద్ దేవరా ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వీడియో ట్వీట్లో ముఖేష్ అంబానీతో పాటు, ఉదయ్ కొటక్ లాంటి కార్పోరేటర్లు, చిన్న వ్యాపారులు కూడా ఉన్నారు. కాగా సౌత్ ముంబైలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి.