జుకర్బర్గ్ ఆధ్వర్యంలోనే ఫేస్బుక్ డేటా సేల్.. మరో సంచలన రిపోర్ట్
ఫేస్బుక్ యూజర్ల డేటా చేతులు మారడంపై గత కొద్ది కాలం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. అయితే ప్రముఖ వార్తా సంస్థ ఎన్బిసి కథనాల ప్రకారం జుకర్బర్గ్ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలోనే డేటా ఇతరులకు చేరిందని అర్థమవుతోంది. దీంతో మరోసారి ఫేస్ బుక్ కో ఫౌండర్ వార్తల్లో నిలిచారు.
2011నుంచి 2015 మధ్య సుమారు 4000 పేజీల అంతర్గత రిపోర్ట్ బయటకు వచ్చింది. వాటి ప్రకారం కొంత మంది యాప్ డెవలపర్స్కు ఆయన డేటా అమ్మేందుకు సిద్ధపడ్డారని, ఇందుకోసం 100 డీల్స్ కూడా కుదుర్చుకున్నట్టు తేలింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థ ఫేస్ బుక్కు యాడ్స్ ఇచ్చే యాప్ సంస్థలకు ఈ డేటా అమ్మేందుకు సిద్ధపడింది.
ఇక పిల్లల బొమ్మల మార్కెట్లోకి రిలయన్స్ !
యూజర్లకు చెందిన ప్రయివేటు సమాచారం తమ చేతుల్లో భద్రంగా ఉందని, అదే తమకు ప్రయార్టీ అని పదే పదే చెబుతూ వస్తున్న ఫేస్బుక్కు ఈ న్యూస్ మరో షాకింగ్ లాంటిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొన్ని యాప్స్కు, మెసేజింగ్ సంస్థలకు ఫేస్ బుక్ ద్వారా యాక్సెస్ను నిరోధించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నించింది. తమకంటే సదరు మెసేజింగ్ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత వస్తోందనే ఉద్దేశంతో ఇలాంటి కకృతి చేష్టలకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది.
తాజాగా బయటకు వచ్చిన డాక్యుమెంట్లలో కొంత మంది ఉద్యోగులు జుకర్బర్గ్ను ''మాస్టర్ ఆఫ్ లెవరేజ్''గా పేర్కొన్నారు. ఫేస్ బుక్తో పాటు సిక్స్4త్రీ అనే సంస్థకు మధ్య జరిగిన ఒప్పంద డాక్యుమెంట్ల బ్రిటిష్ జర్నలిస్ట్ డంకన్ క్యాంప్బెల్ సహా కొంత మంది మీడియా సంస్థల ప్రతినిధులకు చేరాయి. ఇప్పుడు ఇవి బయటకు పొక్కాయి. 4000 పేజీల్లో కేవలం 400 పత్రాలు మాత్రమే ఇప్పుడు బయటపడ్డాయి. కోర్టుకు గతంలో సిక్స్4త్రీ సంస్థ సమర్పించిన పత్రాల్లో కొన్ని బయటకు పొక్కాయి.
ఫేస్బుక్ మాత్రం కాదంటోంది
తాజాగా వచ్చిన ఈ డాక్యుమెంట్లలో వాస్తవం లేదని, కొన్ని పత్రాలను బయటకు తీసి వాటిని తమకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారని ఫేస్ బుక్ యాజమాన్యం చెబ్తోంది.