జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మూసివేత!!
ప్రముఖ విమానయాన సంస్థ, తీవ్రమైన అప్పుల కుప్పలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా తన సేవలను నిలిపివేసే దిశగా సాగుతోంది. ఎందుకంటే జెట్ ఎయిర్లో వాటాలు కొనేందుకు ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో ఇది తప్పేలా కనిపించడం లేదు. గతంలో అప్పులు ఇచ్చిన వాళ్లు కూడా కొత్తగా ఒక్క పైసా కూడా రుణం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. దీంతో క్యాష్ నిల్వలు జీరో స్థాయికి చేరుకున్నాయి, ఫ్యూయెల్ కూడా దాదాపుగా అయిపోయింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో టెంపరరీ క్లోజర్ ఒక్కటే గత్యంతరమని యాజమాన్యం భావిస్తోంది.
50 శాతం జీతాలకే స్పైస్జెట్లో చేరుతున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు: కారణాలివే
నరేష్ గోయెల్ పాల్గొంటే
బిడ్డింగ్ ప్రక్రియలో జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయెల్ పాల్గొంటే తాము వాక్ అవుట్ చేయకతప్పదని ఏతిహాద్ ఎయిర్వేస్, టిపిజి క్యాపిటల్ సంస్థలు తేల్చిచెప్పడంతో నరేష్ గోయెల్ బిడ్డింగ్ నుంచి వైదొలిగారు. ఇది కూడా జెట్ ఎయిర్కు మరింత నిధుల కటకట తెచ్చింది. ప్రస్తుతం జెట్ ఎయిర్ దగ్గర కేవలం 7 విమానాలు మాత్రమే నిర్వాహణలో ఉన్నాయి. ఫ్యూయెల్ కూడా కొన్ని రోజుల నుంచి ఏ రోజుకు ఆ రోజు ఇచ్చి తెచ్చుకుని దుస్థితికి వచ్చింది. ఈ రోజుతో ఆ ఆశలు కూడా అడిఆశలయ్యాయి.
ఆరునెలల క్రితం కూడా జెట్ దగ్గర సుమారు 123 విమానాలు ఆపరేషన్లో ఉండేవి. ఇప్పుడు రుణదాతలంతా వాటిని వెనక్కి తీసుకోవడంతో జెట్ ఎయిర్వేస్ పని దాదాపుగా అయిపోయినట్టే ఉంది.
ప్రభుత్వం ఆదుకుంటుందా
ప్రస్తుతం ఉన్న స్థితిలో ప్రభుత్వం ఆదుకుంటుందనే అంచనాలున్నాయి. ఎందుకంటే గతంలో సత్యం కంప్యూటర్స్ మాదిరి ఈ సంస్థను కూడా ఆదుకోవచ్చని అనుకున్నారు. సుమారు 20 వేల మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశం కావడంతో పాటు వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల పుట్టి కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్న నేపధ్యంలో కేంద్రం ముందుకు వస్తుందని అనుకున్నారు. అందుకు తగ్గట్టు ఎస్బీఐ కొద్దోగొప్పో ప్రయత్నాలు చేసినప్పటికీ మిగిలిన రుణదాతలు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. ఇప్పటికిప్పుడు కావాల్సిన రూ.1500 కోట్ల ఎమర్జెన్సీ ఫండింగ్కు కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. తాజా వ్యవహారంపై ఉదయాన్నే ప్రధాని మంత్రి కార్యాలయానికి జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది.
ఇప్పటికే రుణం ఇచ్చిన దాతల్లో ఎవరో ఒకరు ఎమర్జెన్సీ ఫండింగ్ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబ్తున్నప్పటికీ ఈ రోజు ఈ స్టాక్ మార్కెట్లలో ఏకంగా 15 శాతం పడిపోయింది. చివరకు కోలుకున్నప్పటికీ సుమారు 9 శాతం స్టాక్ నష్టపోయింది.
గతంలో కూడా..
గతంలో ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఇండియాలో కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్, పారామౌంట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్, వాయుదూత్, దమానియా ఎయిర్ వంటి సంస్థలు మూతబడ్టాయి. వీటిలో కొన్ని పేర్లు జనాలు పూర్తిగా మరిచిపోయి ఉంటారు, ఇంకొంత మందికి తెలిసి కూడా ఉండదు.