పన్ను మినహాయింపులో రాజకీయ జోక్యమేలేదు: అనిల్ అంబానీ-మోడీలకు ఊరట!
ముంబై: రాఫెల్ వివాదంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్.కామ్.) అనుబంధ సంస్థ రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్కు ఫ్రాన్స్లో 143.7 మిలియన్ యూరోల మేర పన్నులు మాఫీ చేసినట్లు ఫ్రెంచ్ పత్రికలో రావడం కలకలం రేపింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు 2015లో భారత్ ప్రకటించిన కొద్ది నెలలకు ఈ వెసులుబాటు లభించిందని పేర్కొంది. ఈ వార్త కలకలం రేపింది. అయితే ఈ వార్తల్ని ఆర్.కామ్. కొట్టి పారేసింది.
2008లోనే సమస్య పరిష్కారమైంది : ఫ్రాన్స్ పత్రిక కథనంపై ఆర్కామ్
రాఫెల్తో ఎలాంటి లబ్ధి లేదు
పన్ను సమస్య 2008 నాటిదని, రాఫెల్ ఒప్పందం కుదరడానికి చాలా రోజుల ముందే ఈ సమస్యను పరిష్కరించుకున్నామని ఆర్.కామ్. తన ప్రకటనలో స్పష్టం చేసింది. రిలయన్స్ ఫ్లాగ్ పన్నుల సమస్య దాదాపు పదేళ్ల క్రితం నాటిదని, 2008-2012 మధ్య ఫ్లాగ్ ఫ్రాన్స్ రూ.20 కోట్లు నష్టపోయిందని, కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అధికారులు రూ.1,100 కోట్ల పన్నులు విధించారని, ఇది చాలా పెద్ద మొత్తమే కాకుండా చట్ట విరుద్ధం కావడంతో తాము స్థానిక చట్టాల్ని ఆశ్రయించామని, ఫ్రాన్స్ దీంతో రాజీ పరిష్కారం కింద రూ.56 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని, భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫేల్ ఒప్పందం కుదరడానికి ఎన్నో రోజుల ముందే ఈ సమస్య పరిష్కారమైందని ఆర్.కామ్. స్పష్టం చేసింది. కానీ రాఫెల్ ఒప్పందం నుంచి తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని తెలిపింది.
సంబంధం లేదని చెప్పిన ఫ్రాన్స్ ఎంబసీ
ఫ్రెంచ్ పత్రిక కథనంపై రక్షణ శాఖ కూడా స్పందించింది. పన్ను అంశానికి, రాఫేల్ ఒప్పందానికి మధ్య లింక్ పెట్టడం సరికాదని భారత రక్షణ శాఖ తన ప్రకటనలో తెలిపింది. తప్పుడు ప్రచారం కోసం ఇలా చేస్తున్నారని, ఒక ప్రయివేటు సంస్థకు ఇచ్చిన పన్ను రాయితీకి రాఫెల్ ఒప్పందంతో ఏ మాత్రం సంబంధం లేదని పేర్కొంది. మరోవైపు, రిలయన్స్ సంస్థకు ఇచ్చిన పన్ను మినహాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని భారత్లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం కూడా స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగిందంటే?
ఫ్రాన్స్కు చెందిన 'లీ మాండె'లో ఈ కథనం వచ్చింది. ఆర్.కామ్.కు చెందిన రిలయన్స్ ఫ్లాక్ అట్లాంటిక్ ఫ్రాన్స్ పేరిట ఒక సంస్థ ఫ్రాన్స్లో నమోదైంది. దీనికి ఉపరితల కేబుల్ నెట్ వర్క్, ఇతర టెలికాం మౌలిక వసతులు ఉన్నాయి. ఫ్రాన్స్కు చెందిన పన్ను అధికారులు ఈ సంస్థపై దర్యాఫ్తు చేసి 2007-2010 కాలానికి అరవై మిలియన్ యూరోల పన్ను చెల్లించాలని తేల్చారు. ఈ సెటిల్మెంట్ కింద 7.6 మిలియన్ యూరోలను చెల్లిస్తామని రిలయెన్స్ సంస్థ ప్రతిపాదించగా, ఫ్రాన్స్ అధికారులు ససేమీరా అన్నారు. 2010-12 కాలానికి సంబంధించి పన్ను విభాగం అధికారులు మరోసారి దర్యాఫ్తు జరిపి అనదంగా 91 మిలియన్ యూరోలు చెల్లించాలన్నారు. 2015 నాటికి రిలయన్స్ పన్ను బకాయిలు కనీసం 151 మిలియన్ యూరోలకు చేరింది. . అదే సమయంలో నాటి ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రాన్స్వో హోలన్తో చర్చల అనంతరం 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రధాని మోడీ 2015 ఏప్రిల్ 10న ప్రకటన చేశారు. దీనిపై 2016 సెప్టెంబర్ 23న తుది ఒప్పందం కుదిరింది. యుద్ధ విమానాల కొనుగోలుపై మోడీ ప్రకటన చేసిన 6నెలలకు (2015 అక్టోబర్) ఫ్రాన్స్ పన్ను విభాగం అధికారులు రిలయన్స్ నుంచి 7.3 మిలియన్ యూరోల (రూ.56 కోట్లు)ను తీసుకొని, మిగతా 143.7 మిలియన్ యూరోల పన్నును రద్దు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఆర్.కామ్. జరిగిన విషయం ఏమిటో వెల్లడించింది.