జెట్ ఎయిర్వేస్కు దెబ్బ మీద దెబ్బ: రేపటి నుంచి 1,100 పైలట్లు ధర్నా!
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను కష్టాలు వెన్నంటుతున్నాయి. దాదాపు 1,100 మంది పైలట్లు సోమవారం ఉదయం పది గంటల నుంచి విధుల్లో చేరవద్దని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తమ వేతనాలు ఇవ్వనందుకు నిరసనగా విమానాలు నడపవద్దని పైలట్లు నిర్ణయించుకున్నట్లు నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) పేర్కొంది.
జెట్ ఎయిర్వేస్లో పైలట్లు మాత్రమే కాకుండా ఇంజినీర్లు, సీనియర్ మేనేజ్మెంట్ కూడా జనవరి మాసం నుంచి వేతనాలు తీసుకోలేదు. ఇతర విభాగాల్లోని ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో పైలట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పైలట్లు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కానీ గోయల్ తప్పుకోవడం, ఎస్బీఐ కన్సార్టియం రంగంలోకి దిగడంతో విరమించుకున్నారు. ఇప్పటికీ తమ వేతనాలు రాకపోవడంతో పైలట్లు విధులకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
జెట్ ఎయిర్వేస్కు రేపు రూ.1000 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్!
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇప్పటి వరకు తమకు మూడున్నర నెలలకు సంబంధించి వేతనాలు రావాల్సి ఉందని, ఈ డబ్బులు తమకు ఎప్పుడు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని, కాబట్టి తాము ఏప్రిల్ 15వ తేదీ నుంచి విమానాలు రన్ చేయవద్దని నిర్ణయించుకున్నామని, మొత్తం 1,100 మంది పైలట్లను ఈ నిర్ణయానికి వచ్చామని, సోమవారం ఉదయం 10 గంటల నుంచి సేవలు ఆగిపోతాయని చెప్పారు.