విలాసవంతమైన.. కోట్లు విలువ చేసే నీరవ్ మోడీ 13 లగ్జరీ కార్లు ఈ నెల 18న వేలం!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నిందితుడైన నీరవ్ మోడీకి చెందిన 13 లగ్జరీ కార్లను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) వేలం వేయనుంది. ఏప్రిల్ 18వ తేదీన ఈ వేలం జరిగే అవకాశముంది. ఇప్పటికే అతనికి సంబంధించిన పెయింటింగ్స్ను వేలం వేశారు. దీని ద్వారా ఐటీ శాఖ రూ.54.84 కోట్లు రికవరీ చేసింది. ఇప్పుడు అతనికి సంబంధించిన లగ్జరీ కార్లు రోల్స్ రాయ్స్ ఘోస్ట్, పోర్స్చే పనామెరా, రెండు మెర్సిడెజ్ బెంజ్, మూడు హోండా కార్లు, టొయొటా ఫార్చునర్, ఇన్నోవాలాంటి వాటిని వేలం వేయనుంది.
నీరవ్పై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఈడీ ఆ కార్లను ఇదివరకే స్వాధీనం చేసుకుంది. ఈ కార్లు మంచి కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. వీటి ద్వారా మరింత డబ్బు రాబట్టాలని ఈడీ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్కు (ఎంఎస్టీసీ) ఈ వేలం కాంట్రాక్టును అప్పగించింది.
పెంపుడు కుక్కకు కోసం బెయిల్ ఇవ్వండి!: బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోడీ లాయర్లు
నీరవ్ మోడీ పీఎన్బీ నుంచి 13వేల కోట్లు తీసుకున్న స్కాంలో నిందితుడు. ఆయన ఇంటి నుంచి 178 ఖరీదైన పేయింటింగ్స్, 11 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని వేలం వేసేందుకు ముంబై ప్రత్యేక కోర్టు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పేయింటింగ్స్ వేలం వేయగా, ఇప్పుడు కార్లు వేలం వేస్తున్నారు. అతనికి చెందిన దాదాపు రూ.1900 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జఫ్తు చేసింది. వీటిలో విలువైన సామాగ్రి, ఆభరణాలు, కార్లు, పేయింటింగులు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా హాంగ్కాంగ్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, సింగపూర్, యూఏఈలలో రూ.తొమ్మిది వందలకు కోట్లకు పైగా ఆస్తిని స్వాధీనం చేసుకుంది.
రోల్స్ రాయ్స్ ఘోస్ట్
నీరవ్ మోడీ కలెక్ట్ చేసిన వాటిల్లో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయ్స్ ఘోస్ట్. ఇది 6.6 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజిన్ కలిగిన కారు. 4.8 సెకండ్లలో 0 కిలో మీటర్ల నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని అత్యధిక వేగం గంటకు 250 కిలో మీటర్లు. ఈ కారు విలువ రూ.5 కోట్లకు పైగా ఉంది.
ఫోర్స్చే పనామెరా
నీరవ్ కొనుగోలు చేసిన మరో విలువైన కారు పోర్స్చే పనామెరా. ఇది 3.0 లీటర్ వీ 6 డీజిల్ ఇంజిన్ కారు. ఇది 6.6 సెకండ్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని వేగం గంటకు 250 కిలో మీటర్లు. దీని విలువ రూ.2 కోట్లు.
మెర్సిడెజ్ బెంజ్, మరిన్ని కార్లు
నీరవ్ మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 350 సీడీఐ రెండు కార్లు కూడా కొనుగోలు చేశాడు. ఇది మోస్ట్ లగ్జరియస్ ఎస్యూవీ. పొడవైన కారు. 3.0 లీటర్ టర్బో చార్జ్డ్ వీ6 డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. దీని ఖరీదు రూ.83 లక్షల వరకు ఉంటుంది.
నీరవ్ వద్ద మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్ కారు కూడా ఉంది. పెట్రోల్ వీ6 అండ్ 2.0 లీడర్ డీజిల్ కారు. దీని ఖరీదు రూ.76 లక్షలకు పైగా ఉంది. నీరవ్ వద్ద టయోటా ఫార్చునర్ కారు ఉంది. దీని ఖరీదు రూ.32 లక్షల వరకు ఉంది. ఇది భారత్లో పాపులర్ ఎస్యూవీ కారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. వీటి ఖరీదు రూ.26.2 లక్షల నుంచి రూ.31.99 లక్షల వరకు ఉంది. నీరవ్ వద్ద మూడు టయోటా, హోండా కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా కారు ధర రూ.14 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ఉంది. హోంటా సిటీ కారు ధర రూ.27 లక్షల వరకు ఉంది.