పాకిస్తాన్-చైనా: ఎనిమీ షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు రూ.11,300 కోట్లు, అసలు ఏమిటివి?
న్యూఢిల్లీ: ఎనిమీ షేర్లను (శత్రు షేర్లు) అమ్మడం ద్వారా భారత ప్రభుత్వానికి రూ.700 కోట్లు వచ్చాయి. నవంబరు 2018లో కేంద్ర మంత్రివర్గం ఈ తరహా షేర్ల విక్రయానికి చర్యలు తీసుకోమని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (డీఐపీఏఎం-దిపమ్) విభాగానికి సూచించింది. దీంతో ఆ విభాగం వివిధ కంపెనీల్లోని ఎనిమీ షేర్లను విక్రయించింది.
ఈ షేర్లను అమ్మడంతో పాటు సీపీఎస్ఈల బైబ్యాక్ ఆఫర్తో (షేర్లు తిరిగి కొనుగోలు) మరో రూ.10,600 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. దీంతో షేర్ల అమ్మకం, బైబ్యాక్ ద్వారా మొత్తం రూ.11,300 కోట్లు సమకూరాయి. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విధించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80,000 కోట్లను సులువుగా అధిగమించి రూ.85,000 కోట్లు సమకూర్చుకుంది.
ఐపీఎల్: బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్టెల్, జియో ఐపీఎల్ ఆఫర్లు
ఎనిమీ షేర్లు అంటే ఏమిటి?
ఎనిమీ షేర్ల విక్రయానికి గత ఏడాది నవంబర్ నెలలో కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. భారత్ నుంచి పాకిస్థాన్, చైనాలకు వలస వెళ్లి, ఏళ్లుగా భారతీయ పౌరసత్వం లేని వ్యక్తులకు చెందిన షేర్లను ఎనిమీ షేర్లుగా పరిగణిస్తున్నారు. వీరు పాక్, చైనాలకు వెళ్లి సుదీర్ఘకాలం కావడంతో పాటు భారతీయ పౌరులుగా ఉండదు. వీరికి చెందిన ఆశ్తులతో పాటు కంపెనీల్లో వీరికి చెందిన షేర్లను కూడా విక్రయించేందుకు డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ (దిపమ్)కు కేంద్రం అనుమతిని ఇచ్చింది.
బ్రిటన్, అమెరికాలో ప్రారంభం
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి వాటి శతృదేశాలైన జర్మని, జపాన్లకు కొందరు వలస వెళ్లారు. అలా పారిపోయిన వారి ఆస్తులను అమెరికా, బ్రిటన్ దేశాలు స్వాధీనం చేసుకొని, ఎనిమీ షేర్లుగా విక్రయించాయి. భారత్ కూడా అదే దారిలో నడిచింది. 1962, 1965లలో చైనా, పాకిస్తాన్ దేశాలతో యుద్ధం జరిగినప్పుడు ఆయా దేశాలకు వెళ్లి తలదాచుకున్న వారి అన్ని రకాల ఆస్తులను డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
వీటి ద్వారా మరింత ఆదాయం
మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈ సమయంలో ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల ద్వారానే ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చింది. ఈటీఎఫ్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టి ప్రభుత్వం రూ.45,729 కోట్లు రాబట్టుకుంది. ఆ తర్వాత స్థానంలో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ల వాటా కొనుగోలు లావాదేవీ నిలిచింది. ఆర్ఈసీలో 52.63 శాతం ప్రభుత్వ వాటాను పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పీఎఫ్సీ) కొనుగోలు చేసింది. దీంతో రూ.14,500 కోట్ల ఆదాయం వచ్చింది. రైట్స్, ఎంఎస్టీసీ, ఆర్ఐటీఈఎస్, ఇర్కాన్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, మిధాని వాటాల విక్రయం ద్వారా రూ.1,929 కోట్లు సమీకరించింది. కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.5,218 కోట్లు, యాక్సిస్ బ్యాంక్లో ఎస్యూయూటీఐ వాటా విక్రయం నుంచి మరో రూ.5,379 కోట్లు వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2019-20 నూతన ఆర్థిక సంవత్సరానికిగాను పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.80,000 కోట్లుగా కేంద్రం నిర్దేశించుకున్నది.