2 రోజుల క్రితం ఓలా క్యాబ్కు కర్ణాటక ప్రభుత్వం షాక్, ఇప్పుడు ఊరట
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలాకు కర్ణాటకలో ఊరట లభించింది. అంతకుముందు, రాష్ట్రంలో ఓలా క్యాబ్స్ను ఆరు నెలల పాటు నిషేధిస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఓలా అధికారులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అనంతరం ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు కర్ణాటక మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్లో నిషేధం ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి (శనివారం రాత్రి ట్వీట్ చేశారు) ఓలా క్యాబ్స్ తమ వ్యాపారాన్ని యథావిధిగా నిర్వహించుకోవచ్చునని మంత్రి పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు, నూతన విధానాలపై పరిశ్రమలు ప్రభుత్వాలతో కలిసి పని చేయాలన్నారు.
ఏం జరిగిందంటే?
ఓలా ట్యాక్సీలు, ఆటోలపై కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ అంతకుముందు (22వ తేదీన) 6 నెలల పాటు నిషేధం విధించింది. అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలను నడుపుతున్నందుకు గానూ రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీలను నడపం నిషేధం. కానీ నిబంధనలకు విరుద్ధంగా జనవరి నుంచి ఓలా బెంగళూరులో పలు ప్రాంతాల్లో బైక్ ట్యాక్సీలను నడుపుతోంది. ఈ కారణంగా రవాణా శాఖ గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు బీటా పైలట్ ప్రాజెక్టు కింద ఈ ట్యాక్సీలను నడుపుతున్నామని ఓలా సంస్థ తెలిపింది. అయితే సంస్థ ఇచ్చిన వివరణ అసంపూర్ణంగా ఉందని, ఓలాపై రవాణాశాఖ చర్యలు తీసుకుంది. ఆరు నెలల పాటు ఓలా లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ట్యాక్సీలు, ఆటోలు నడవకుండా నిషేధించింది.
మాల్యాకు షాక్: బెంగళూరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్న కోర్టు
ప్రభుత్వం తమ క్యాబ్స్ను నిషేధించడంపై ఓలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకరమని, చట్టాలకు అనుగుణంగానే ఓలా వ్యవహరిస్తుందని, ప్రజల రవాణా సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని, ఈ విషయంపై అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. అనంతరం చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో సస్పెన్స్ను ఎత్తివేశారు.