మీ స్విగ్గీ ఆర్డర్ కూడా క్రెడిట్ స్కోర్ను మార్చేయగలదు? ఎలానో చూడండి
క్రెడిట్ కార్డ్ పొందాలన్నా.. లేక ఏదైనా వస్తువు లోన్పై తీసుకోవాలన్నా.. రుణాలు పొందాలన్నా ఇప్పుడు క్రెడిట్ స్కోర్ అతి అవశ్యమైంది. అయితే న్యూ ఏజ్ బ్యాంక్స్, ఎన్ బి ఎఫ్ సి సంస్థలు రొటీన్ సిబిల్ స్కోర్ను ఇప్పుడు అంతగా పరిగణలోకి తీసుకోవడం లేదు. వాటి స్థానంలో అధిక ప్రాచుర్యం పొందుతున్న బిగ్ డేటా ఎనలిటిక్స్, డేటా మైనింగ్ వంటివి చొప్పిస్తున్నాయి. చివరకు మీ సోషల్ ప్రొఫైల్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్కు కూడా ఫుల్ ప్రయార్టీ ఇస్తున్నాయి. దీంతో మీరు చేసే ప్రతీ ఆన్ లైన్ లావాదేవీ కూడా మీకు లోన్ వస్తుందో.. రాదో డిసైడ్ చేయగలదు.
రైతులకు వివిధ పథకాల్లో డబ్బులు ! వెండికి విపరీతంగా డిమాండ్
న్యూ స్కోర్పైనే కన్ను
గత పదేళ్లుగా సిబిల్ స్కోర్ విపరీతమైన ప్రాచుర్యం పొందింది. హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్లు శాంక్షన్ అయ్యేందుకు ఇది ఏకైక సాధనం. రుణం తీసుకునే సదరు వ్యక్తి దాన్ని తిరిగి చెల్లించగలడా లేదా.. గతంలో ఆయన తీసుకున్న రుణాలేవి వంటి అనేక అంశాలను సిబిల్ పొందుపరుస్తోంది. సెబీ, ఆర్బీఐ వంటి సంస్థల అనుమతితో ఏర్పాటైన ఈ సిబిల్.. దేశంలోని అన్ని బ్యాంకులకూ అనుసంధానమై ఉంటుంది. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు న్యూ ఏజ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సేవలను అందించే సంస్థలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి.
మీకు రూ.500 నుంచి రూ..5 లక్షల వరకూ లోన్లను గంటల్లో శాంక్షన్ చేసేస్తున్నాయి. అయితే ఇందుకోసం టెక్నాలజీని విరివిగా వాడేస్తున్నాయి. ఇది తమ రిస్కును గణనీయంగా తగ్గిస్తోంది అంటున్నాయి సంస్థలు.
సోషల్ ప్రొఫైల్ కూడా ముఖ్యం
సిబిల్ స్కోర్ ఏమీ హోలీ బుక్ కాదని.. దాన్ని ఒక్కటే ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేము అనేది సంస్థల మాట. అందుకే క్రెడిట్ విద్య వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు క్రెడిట్ విద్య అనే డేటా బేస్డ్ క్రెడిట్ అసెస్మెంట్ సంస్థతో 40 బ్యాంకులు, ఎన్. బి. ఎఫ్. సిలు, ఫిన్ టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీళ్లు ప్రధానంగా డిజిటల్ ఫుట్ ప్రింట్ను ఎనలైజ్ చేస్తారు. ఉదాహరణకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని అందులో ఎన్ని సార్లు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేశారు, ఆన్ లైన్లో వస్తువులను ఎంత డబ్బులు చెల్లిస్తున్నారు, క్యాబ్స్కు ఎంత కడ్తున్నారు, బార్లు - రెస్టారెంట్లకు ఎంత ఖర్చు చేస్తున్నారు వంటి డీటైల్స్ను పరిగణలోకి తీసుకుంటున్నారు. వీటిని డేటా మైనింగ్ చేసి మీ క్రెడిట్ స్కోర్ ఎంతో చెప్పేసే రోజులు వచ్చాయి.
ఒక వేళ మీరు తరచూ గేమింగ్ సైట్స్, గ్యాంబ్లింగ్ సైట్లకు డబ్బులు భారీగా ఖర్చు చేస్తున్నట్టు కనుగొంటే మీకు లోన్ వచ్చే అవకాశాలు దాదాపుగా తగ్గిపోవచ్చని సదరు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే దీని వల్ల మీ క్రెడిట్ రిస్క్ ఎక్కువవుతుంది.
జీతం పడిన వెంటనే ఈఎంఐ కట్
మరో సంస్థ లోన్ ట్యాప్ది ఇంకో మోడల్. వాళ్లు మీకు జీతం ఎప్పుడు పడ్తోంది, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ నెలాఖరుకు ఉంటోందో చూస్తారు. అంతే కాదు మీకు ఏ తేదీలో జీతం పడ్తుందో చూసి.. అవసరమనుకుంటే దాని వెంటనే ఈఎంఐ కట్ అయ్యేలా కూడా డేట్ను బ్యాంకులకు, లోన్ సంస్థలకు సూచిస్తున్నాయి. దీని వల్ల జీతం ఖర్చు కాకముందే వీళ్ల ఈఎంఐని రాబట్టుకోవాలనేది బ్యాంకుల తాపత్రయం.
ఇవే కాకుండా మరికొన్ని సంస్థల తమ యాప్స్ ద్వారా మీ ఎస్ఎంఎస్లను రీడ్ చేసి మీ ట్రాన్సాక్షన్ కెపాసిటీని లెక్కదేలుస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో క్రెడిట్ స్కోర్ కాపాడుకోవడానికి చాలా కష్టాలే పడాల్సినట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. లోన్ తీసుకుంటున్నామంటే.. మన వ్యక్తిగత సమాచారమంతా బ్యాంకుల చేతికి వెళ్లిపోతున్నట్టే ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.