1.76 లక్షల ఉద్యోగులకు జీతాల్లేవ్ ! చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్. భారత్ సంచార్ నిగం లిమిటెడ్. టెలికాం రంగంలో ఓ విప్లవం. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఈ బీఎస్ఎన్ఎల్.. ప్రైవేట్ కంపెనీల పోటీకి తట్టుకోలేక దాదాపుగా చేతులెత్తేసిన స్థితికి వచ్చేసింది. లాభాల సంగతి దేవుడెరుగు, కనీసం ఆదాయం కూడా పెరగకుండా సంస్థ నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. దీంతో చివరకు ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి దిగజారింది బీఎస్ఎన్ఎల్.
భార్య ,భర్తలం ఇద్దరం మాట్లాడుకోము..చందా కొచ్ఛర్
ఇప్పటివరకూ ఫిబ్రవరి నెల జీతాలు ఉద్యోగులకు ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో 1.76 లక్షల మంది ఉద్యోగుల భవిత ఆందోళనలో పడింది. గతంలో ఎప్పుడూ ఇలా శాలరీస్ డిఫాల్ట్ అయిన చరిత్ర బీఎస్ఎన్ఎల్కు లేదు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ ప్రభుత్వ సంస్థ మనుగడే కష్టంగా మారింది.
ఐదేళ్ల నుంచీ నష్టాలే
గత ఐదేళ్లుగా బీఎస్ఎన్ఎల్ పర్ఫార్మెన్స్ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రైవేట్ ఆపరేటర్ల పోటీ ఒకటైతే.. జియో వంటివి టెలికాం మార్కెట్ను మరింత దిగజార్చాయి. సంస్థకు వస్తున్న ఆదాయంలో ఉద్యోగుల జీతాలకే 55 శాతం పోతోంది. ఇది ఏటికేడు 8 శాతం పెరుగుతోంది. ఇక ఆదాయం పరంగా పెద్దగొప్పగా ఏమీ లేదు. 2017లో రూ.4786 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ, గతేడాది రూ.8000 కోట్ల నష్టాలను మిగిల్చింది.
రోడ్డున పడ్డట్లేనా
ఇది ముందే ఎన్నికల సీజన్ కావడంతో ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే తమ జీతాల ఆలస్యంపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాలు కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హాను సంప్రదించారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
బీఎస్ఎన్ఎల్
ప్రస్తుతానికి అప్పు తీసుకుని జీతాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ అనుకుంటోంది. అయితే దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అందుకే ఈ లక్షలాది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం కనిపిస్తోంది. విస్తృతమైన నెట్వర్క్ ఉన్నా.. దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం, ప్రైవేట్ నుంచి పోటీని పట్టించుకోకుండా తమ ధోరణిలో వెళ్లడం, ఖర్చులు తగ్గించుకోకపోవడం వంటివన్నీ బీఎస్ఎన్ఎల్ను ముంచేశాయి. ఇప్పటికైనా తేరుకుని, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించకపోతే బీఎస్ఎన్ఎల్ ఒక చరిత్రలానే మిగిలిపోయేట్టు కనిపిస్తోంది.