దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా నష్టాలే ... 17 ఏళ్ళ కనిష్టానికి రెడ్డి ల్యాబొరేటరీస్
వరుసగా ఏడు సెషన్ల నుండి దేశీ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో నడుస్తుంది. గత వారంలో నష్టాల్లో ఉన్న మార్కెట్, ఈ వారం లో నైనా కోలుకుంటుంది అనుకుంటే ఈ వారం కూడా మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడి వెనక్కి తరలిపోవడం, నిరాశాజనకంగా వచ్చిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు మార్కెట్ వర్గాలను నైరాశ్యంలోకి నెట్టాయి. క్రమంగా క్షీణిస్తున్న మార్కెట్ పరిస్థితిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.
ఏడు సెషన్లుగా నష్టాల బాటలోనే ... ఇన్వెస్టర్లలో పెరుగుతున్న టెన్షన్
దేశీ స్టాక్ మార్కెట్ వారమంతా నష్టాల్లోనే ఊగిసలాడింది .శుక్రవారం కూడా మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సూచీలు నష్టపోవడం ఇది వరుసగా ఏడో సెషన్. బెంచ్మార్క్ ఇండెక్స్లు ఉదయం లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మిడ్ సెషన్లో ఇండెక్స్లు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. అంతే కాదు రానున్న ఎన్నికల నేపధ్యంలో కూడా డొమెస్టిక్ ఈక్విటీలు నష్టాల్లో సాగుతున్నాయి. దీంతో శుక్రవారం ఒక్కసారిగా సెన్సెక్స్ 300 పాయింట్ల మేర పడిపోయింది. అయితే తర్వాత సూచీల నష్టాలు రికవరీ అయ్యాయి. చివరకు సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 35,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 10,724 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. 2018 అక్టోబర్ 28 నుంచి చూస్తే ఇండెక్స్లు ఒక వారంలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారి కుదేలయ్యారు.
ఊహించనంతగా ఫార్మా కంపెనీల షేర్లు పతనం
నిఫ్టీ 50లో బీపీసీఎల్, ఎన్టీపీసీ, గెయిల్, పవర్ గ్రిడ్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, రిలయన్స్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీపీసీఎల్, ఎన్టీపీసీ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. రిలయన్స్ 2 శాతం మేర లాభపడింది. అదేసమయంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, టాటా స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందాల్కో, వేదాంత, హెచ్పీసీఎల్ షేర్లు నష్టపోయాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏకంగా 5 శాతం పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కోలుకుంది. చివరకు 4 శాతం మేర నష్టపోయింది.
17 ఏళ్ళ కనిష్టానికి రెడ్డి ల్యాబ్స్ .. ఫామ్483ను జారీ చెయ్యటమే కారణం
శుక్రవారం 17 ఏళ్ల కనిష్ట స్థాయి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఇంట్రాడేలో ఏకంగా 30 శాతం మేర పతనమైంది. రూ.1,872.95 కనిష్ట స్థాయికి పడిపోయింది.డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చివరగా 2001 అక్టోబర్ 15న ఈ స్థాయిని చూసింది. హైదరాబాద్లోని బాచుపల్లి యూనిట్లోని అబ్జర్వేషన్స్ అంశంపై రేటింగ్ సంస్థ జెఫరీస్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. షేరు ధర భారీగా పడిపోయింది. బాచుపల్లి యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించి 11 లోపాలున్నట్లు ఫామ్483ను జారీ చేయటం మార్కెట్ పై ప్రభావం చూపించింది.
రెడ్డి ల్యాబ్స్ కు లోపాలతో అండర్ పర్ఫార్మ్ రేటింగ్
ఈ లోపాలను సరిదిద్దుకోవడానికి సమయం పట్టవచ్చనే అంచనాలతో జెఫరీస్.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరుకు అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది. అదేసమయంలో షేరు టార్గెట్ ప్రైస్ను రూ.2,667 నుంచి రూ.2,180లకు కుదించింది. యూఎస్ఎఫ్డీఏ.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ యూనిట్లో మరోసారి తనిఖీలు నిర్వహించొచ్చని పేర్కొంది.
ఈ ప్రతికూలతల వల్ల డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 30 శాతం మేర నష్టపోయింది. రూ.1872.95లకు పతనమైంది. అయితే క్షణాల్లో కొనుగోళ్లు జరగడంతో షేరు మళ్లీ కోలుకుంది.