అనిల్ అంబానీ వద్ద మాకు ఇచ్చేందుకు డబ్బుల్లేవు, రాఫెల్ డీల్కు ఎక్కడివి: ఎరిక్సన్ లాయర్
న్యూఢిల్లీ: రిలయెన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్కామ్) చైర్మన్ అనిల్ అంబానీ, మరికొందరిపై ఎరిక్సన్ ఇండియా వేసిన ధిక్కార పిటిషన్ కేసులో జడ్జిమెంట్ను సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఈ మేరకు బుధవారం ఈ తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు, మంగళవారం వాదనలు జరిగాయి.
తమకు రూ.550 కోట్ల బకాయిలను చెల్లించే విషయంలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని అనిల్ అంబానీపై ఎరిక్సన్ కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది. దీంతో అనిల్ అంబానీతోపాటు పలువురు మంగళవారం సుప్రీం కోర్టుకు హాజరయ్యారు.

అయితే సమయాభావం, మధ్యాహ్న భోజన విరామం తర్వాత ప్రత్యేక ధర్మాసనం సమావేశం కారణంగా జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ సరణ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ అనంతరం తీర్పును వాయిదా వేసింది.
ఎరిక్సన్ తరఫున సీనియర్ లాయర్ దుశ్యంత్ దవే వాదించారు. బకాయిలు చెల్లించడంలో ఆర్.కామ్ జాప్యం చేస్తోందని చెప్పారు. తమకు చెల్లించేందుకు రూ.550 కోట్లు లేవని, అలాంటప్పుడు రాఫెల్ డీల్ కోసం అనిల్ అంబానీకి డబ్బు ఎక్కడిదని ఎరిక్సన్ లాయర్ ప్రశ్నించారు.
గత ఏడాది డిసెంబర్ 21వ తేదీ లోగా ఎరిక్సన్కు రూ.550 కోట్లు ఇవ్వాలని అక్టోబర్ 23వ తేదీన ఆర్.కామ్కు సుప్రీం కోర్టు చివరి అవకాశమిచ్చింది.
కానీ ఆర్.కామ్ దానిని చెల్లించకపోవడంతో ఎరిక్సన్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. సుప్రీం కోర్టు గత ఏడాది పెట్టిన సెప్టెంబర్ గడువును కూడా ఆర్.కామ్ మీరింది.
కాగా, జాతీయస్థాయిలో ఆర్.కామ్ నెట్వర్క్ను నిర్వహించేందుకు 2014లో ఎరిక్సన్తో ఏడేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.1500 కోట్లకు పైగా ఆర్.కామ్ బకాయిపడిందని, వాటిని ఇప్పించాలని ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరగా రూ.550 కోట్ల సెటిల్మెంట్కు ఎరిక్సన్ అంగీకరించింది. ఈ మొత్తాన్ని కూడా ఆర్.కామ్ చెల్లించలేదని ఎరిక్సన్ కోర్టుకెక్కింది.


Click it and Unblock the Notifications