తొమ్మిదిన్నర లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.. అది ఎలాగంటే వివరణ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సమీపిస్తోన్న వేళ .. ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించిన సర్కార్ ... పన్ను చెల్లింపుదారులను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా రూ.9.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న సరే పన్ను కట్టకుండా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో లోక్ సభలో స్పష్టంచేశారు ఆ శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్.
పొదుపు పథకాల ద్వారా మినహాయింపు
వార్షిక ఆదాయం రూ. 9.5 లక్షల వరకు ఉన్న వారు కూడా పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చని వివరించారు గోయల్. పొదుపు పథకాల ద్వారా టాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అరకొర ఆదాయంతో కాలం వెళ్లదీస్తున్న మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించడానిిక బడ్జెట్లో రాయితీలు ప్రకటించినట్టు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పెరిగిన పన్ను వసూళ్లు .. సమకూరిన వనరులు
మోదీ సర్కార్ అధికారం చేపట్టాక ... గత 4 పూర్తి బడ్జెట్ లలో అన్నివర్గాలకు మేలు చేసిందని చెప్పారు. దీంతో దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగి .. పన్ను వసూళ్లు పెరిగాయని తెలిపారు. మోదీ హయాంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపైందని పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివ్రుధ్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని ఉద్ఘాటించారు. దేశంలో పన్ను వసూళ్లు పెరగడంతో సంక్షేమంపై వ్యయం చేసేందుకు ప్రభుత్వానికి వనరులు అధికంగా సమకూరడం మంచి పరిణామంగా అభివర్ణించారు.
మధ్యతరగతి ప్రజలే ప్రాధాన్యం ..
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారి ప్రయోజనాలకు పెద్దపీట వేశామని చెప్పారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.40 వేల నుంచి 50 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ కు టీడీఎస్ లో ఊరట కలిగించే అంశాన్ని ప్రస్తావించారు. వారికి వడ్డీ రూ. 10 వేల నుంచి రూ. 40 వేల వరకు పెరిగే అవకాశం ఉందని, దీంతో వారికి ప్రయోజనం కలుగుతుందని స్పష్టంచేశారు. అలాగే రెండో ఇళ్ల ఉన్నవారికి కూడా ఓ స్కీం ప్రవేశపెట్టామని తెలిపారు. రెండో ఇళ్లు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇంటిలోన్ లో కొంత వరకు రాయితీ ఇస్తామని .. దీంతో సంబంధింత వ్యక్తికి మేలు జరుగుతుందని వివరించారు.
సబ్బండ వర్గాలకు మేలు
దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకునే సమయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు దేశ శ్రేయస్సు కోరి చేపట్టామని .. ఇందులో ఇసుమంతైన సందేహాలకు తావులేదని స్పష్టంచేశారు. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోరి బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు. మోదీ సర్కార్ మిడిల్ క్లాస్ వారి శ్రేయస్సు కోసం పథకాలను ప్రవేశపెట్టిందని స్పష్టంచేశారు.