ఐఎల్ మరియు ఎఫ్ఎస్ రెయిల్ లిమిటెడ్ అక్రమాల పుట్ట: ఐటీశాఖ
ఐఎల్ & ఎఫ్ఎస్ రెయిల్ లిమిటెడ్లో అవకతవకలు జరిగాయని అభియోగాలు రావడంతో ఆదాయపు పన్నుశాఖ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. డొల్ల కంపెనీల నుంచి తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి కోట్ల రూపాయలకు అవకతవకలు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఈ అవకతవకలు జరిగాయని ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది.
విచారణ సందర్భంగా ఐటీ శాఖ పెద్ద సంఖ్యలో కాంట్రాక్టులు డొల్ల కంపెనీలకు ఐఎల్&ఎఫ్ఎస్ సంస్థ రెయిల్ సంస్థ అప్పగించినట్లు గుర్తించింది. ఇందులో భాగంగా బూటకపు ఇన్వాయిస్లను సృష్టించిందని పనులు జరగకపోయినా జరిగినట్లు చూపించడమే కాకుండా నష్టాల్లో సంస్థ ఉన్నట్లుగా చూపించిందని ఐటీశాఖ వెల్లడించింది. అయితే ఈ కేసుపై స్పందించేందుకు ఐఎల్&ఎఫ్ఎస్ ప్రతినిధి నిరాకరించారు.
ఉదాహరణకు 2013-14 సంవత్సరం చూస్తే... ఐఎల్ & ఎఫ్ఎస్ సంస్థ రూ.20.18 కోట్లు బోగస్ ఇన్వాయిస్లను కోల్కతాకు చెందిన సిల్వర్ పాయింట్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ నుంచి పొందినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఈ ఇన్వాయిస్లు ఇచ్చేందకు గాను సిల్వర్ పాయింట్ సంస్థ 0.50 శాతం కమిషన్ పొందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సిల్వర్ పాయింట్ సంస్థకు రూ. 251 కోట్లు ఆదాయం ఉందని అయితే ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించేందుకు సరైన అనుమతులు లేవని ఐటీశాఖ గుర్తించింది.
తమకు అప్పగించిన పని పూర్తిచేసేందుకు సరైన మ్యాన్ పవర్ లేదని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయం లేదని ఐటీ అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా సిల్వర్ పాయింట్ సంస్థకు చెందిన ఐటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషన్ కోసమే తమ సంస్థ పనిచేసిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో పాటు ఐఎల్ & ఎఫ్ఎస్ సంస్థ కాంట్రాక్టులు కట్టబెట్టిన మరో మూడు సంస్థలపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది.