9మంది కోటీశ్వరుల వద్ద సగం జనాభా సంపద, ఒకరోజు సంపాదన రూ.2200 కోట్లు
ముంబై: మన దేశంలో తొమ్మిది మంది కోటీశ్వరుల వద్ద సగం ఆదాయం ఉండగా, మిగతా ప్రజల వద్ద సగం ఆదాయం ఉందట. అంటే సగం ఆదాయం కేవలం 9మంది వద్దే ఉంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒక శాతం మంది ఆదాయం 39 శాతం పెరిగింది. దిగువ భాగంలో ఉన్నవారి ఆదాయం మాత్రం మూడు శాతం మాత్రమే పెరిగింది.
ఈ వివరాలను అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్ఫాం తన నివేదికలో వెల్లడించింది. తన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా బిలయనీర్ల ఆదాయం గత ఏడాది 12 శాతం (రోజుకు 2.5 బిలియన్ డాలర్లు) పెరగగా, దిగువన ఉన్న పేదల ఆదాయం మాత్రం 11 శాతం క్షీణించింది.
భారత్లో 10 శాతం జనాభాకు సమానమైన 13.6 కోట్ల మంది ప్రజలు 2004 నుంచి అప్పుల్లోనే ఉన్నారు. సంపద అంతా కొందరి వద్దే కేంద్రీకృతమైంది. ప్రపంచంలోని సగం పేదవారి వద్ద ఉన్న మొత్తం ఆదాయం కేవలం 29 ధనికుల వద్ద ఉంది. గత ఏడాది ఇంత ఆదాయం 44 మంది వద్ద ఉండేది. ఇప్పుడు 29 మంది వద్దే ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ సంపద 112 బిలియన్ డాలర్లు. ఆయన ఆదాయంలో ఒక శాతం ఆదాయం 115 మిలియన్ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్తో సమానం.
భారత్లో పది శాతం ధనికులు జాతీయ ఆదాయంలో 77.4 శాతం కలిగి ఉన్నారు. జనాభాలో ఒక శాతం సంపన్నుల వద్ద 51.53 శాతం సంపద ఉంది. దిగువన ఉన్న 60 శాతం మంది వద్ద జాతీయ ఆదాయంలో 4.8 శాతం సంపద మాత్రమే ఉంది. భారత్ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం తొమ్మిది మంది బిలియనీర్ల వద్ద ఉంది. 2022 లోగా భారత్ నుంచి మరో డెబ్బై మంది బిలియనీర్లు పుట్టుకు రావొచ్చునని అంచనా వేసింది.
గత ఏడాది భారత్లో 18 మంది కొత్త బిలియనీర్లు వచ్చారు. భారత్లో బిలియనీర్ల సంఖ్య 119. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా రూ.28 లక్షల కోట్లు. దేశంలోని అత్యంత సంపన్నులు తమ ఆదాయంలో 0.5 శాతం అదనంగా పన్ను చెల్లిస్తున్నారు. కేవలం తొమ్మిది మంది బిలియనీర్ల ఒకరోజు ఆదాయం రూ.2,200కు చేరుకుంది.