ఫ్లాష్ ఫ్లాష్.. తెలంగాణ రైతులకి సి.యం. కె.సి.ర్ మరో గిఫ్ట్ ఏంటో మీరే చూడండి!
చిన్న, సన్నకారు, పెద్ద రైతులనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్నదాతలందరికీ బీమా సౌకర్యం వర్తింపజేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం రైతులంతా సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్సు చేయించాలన్నారు.
రూ.5 లక్షల జీవిత బీమా
మృతి చెందిన రైతుల కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతు బీమాపై ప్రగతిభవన్లో మంగళవారం సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎల్ఐసీ అధికారులు పాల్గొన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు బీమా కల్పించడంపై ఇన్సురెన్సు కంపెనీలతో మాట్లాడి విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.
రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి
రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయాలన్నారు. దీని కోసం బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. రైతులూ ప్రయోజనం పొందుతున్నారు. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కు లేనిది కావద్దనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం అని ముఖ్యమంత్రి అన్నారు.
జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)కు దేశంలో పెద్ద యంత్రాంగం
జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)కు దేశంలో పెద్ద యంత్రాంగం ఉందని, అది ప్రభుత్వ రంగ సంస్థ కూడా కావడంతో ప్రజలకు దానిపై నమ్మకం ఉందన్నారు. అందుకే రైతుల బీమా పథకాన్ని ఎల్ఐసీ ద్వారానే అమలు చేయాలని సూచించారు. రైతుల బీమా పథకం దేశంలోనే మొదటిదని, ఇది రైతుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కేసీఆర్ అన్నారు. రైతుల్లో వివిధ వయసుల వారు ఉండే అవకాశం ఉన్నందున ఎల్ఐసీ నిబంధనలు, తెలంగాణ రైతు బీమా పథకం విధివిధానాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీగా రైతుల, నామినీల జాబితాలను రూపొందించాలని సూచించారు.