అందరూ కలిసి పనిచేస్తే స్టార్టప్ వ్యవస్థ మరింత బలపడుతుంది: నాస్కామ్ మాజీ ఛైర్మన్
దేశ ఐటీ రంగం ఈ ఏడాదిలో మంచిగా సాగిందని వచ్చే ఏడాది సైతం ఆశాజనకంగా 8 నుంచి 10 వృద్ది బాటలో సాగుతుందని నాస్కామ్ మాజీ ఛైర్మన్, సైయంట్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఆ
దేశ ఐటీ రంగం ఈ ఏడాదిలో మంచిగా సాగిందని వచ్చే ఏడాది సైతం ఆశాజనకంగా 8 నుంచి 10 వృద్ది బాటలో సాగుతుందని నాస్కామ్ మాజీ ఛైర్మన్, సైయంట్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి సంబంధించిన టర్నోవర్ 150 బిలియన్ డాలర్లు దాటుతుందని అని అన్నారు. నూతన సంవత్సరంలో ఈ రంగంలో నైపుణ్యాలు వినియోగించుకునే స్థాయి పెరుగుతుందని చెప్పారు. సాఫ్ట్ వేర్ రంగంలో నైపుణ్యం వృద్ధికి నాస్కామ్, ఐటీ కంపెనీలు సంయుక్తంగా ఏదైనా చేయాల్సి ఉందని మోహన్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టులు డిమాండ్ పరంగా ఈ రంగానికి ఎటువంటి సవాళ్లు ఉండకపోవచ్చని చెప్పారు. అమెరికాలో అధికారం చేతులు మారాక ట్రంప్ పగ్గాలు చేపట్టాక మార్చిన కొత్త వీసా నిబంధనల వల్ల మన కంపెనీలకు మరిన్ని నియంత్రణలకు సంబంధించిన నిబంధనల సవాళ్లు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.
ఇది వరకటిలా కాకుండా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు సాధించాల్సి ఉందన్నారు. మార్కెట్ అంచనా వేస్తూ సరికొత్త సాంకేతికతలకు అందిపుచ్చుకోవాల్సిందిగా ఉద్యోగులకు సూచించారు. వినియోగదారులు సృజనాత్మక పరిష్కారాల కోసం చూస్తున్నారన్నారు. వారి వారి అవసరాల్లో భాగంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
భారతదేశ ఆర్థిక ముఖ చిత్రం డిజిటలీకరణ దిశగా సాగుతోందని మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు సైతం బయల్దేరుతున్నట్లు అన్నారు. ఐటీ పరిశ్రమ నూతన ఏడాదిలో దీనిపై దృష్టి సారించాల్సి ఉందని హెచ్చరించారు. రిస్క్ స్థాయిలను తగ్గించేందుకు పరిశ్రమ మొత్తం కృషి చేయాల్సి ఉందన్నారు. స్టార్టప్లు(అంకుర సంస్థలు), పెట్టుబడిదారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీ పరిశ్రమ, వివిధ సంఘాలు, విద్యాలయాలు సమన్వయంతో పనిచేస్తే అంకుర వ్యవస్థ మరింత బలపడుతుందని బీవీఆర్ మోహన్ రెడ్డి ఆశావాహంగా చెప్పారు