నిధుల కొరత, జీఎస్టీ కాదు... ఆర్థిక వృద్ధి వెనుకబాటుకు ఇంకేదో ఉంది
మార్చి 2017లో 7.7 లక్షల కోట్ల వద్ద ఉన్న ఈ నిరర్ధక ఆస్తుల విలువ కేవలం మూడు నెలల్లోనే రూ.9.5 లక్షలకు పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల తీవ్రత, బ్యాంకింగ్ రంగంపై ప్రభావం వంటి
దేశంలో వసూలు కాని రుణాల విషయంలో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది.మరో పక్క సామాన్య ప్రజలు చిన్న రుణాలకు సైతం దూరమవుతున్నారు. ప్రస్తుతం జూన్ 2017 నాటికి ఉన్న సమాచారం మేరకు మొండి బకాయిల విలువ రూ. 9.5 లక్షల కోట్లను చేరింది. ఆర్బీఐ నివేదించని సమాచారం పేరతో రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం బ్యాంకుల్లో మొత్తం స్థూల మొండి బకాయిలు జూన్ నెలతో ముగిసిన ఆర్నెళ్ల కాలంలో 4.5% పెరిగాయి. మార్చి 2017లో 7.7 లక్షల కోట్ల వద్ద ఉన్న ఈ నిరర్ధక ఆస్తుల విలువ కేవలం మూడు నెలల్లోనే రూ.9.5 లక్షలకు పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల తీవ్రత, బ్యాంకింగ్ రంగంపై ప్రభావం వంటి అంశాలను గురించి తెలుసుకుందాం.
ఆసియాలో మన దేశంతోనే ఎక్కువ సమస్య-మన కంటే పాక్ ఒకటే ముందు
తాజా సమాచారం ప్రకారం దేశ నిరర్దక ఆస్తుల విలువ 2016లో మొత్తం రుణాల్లో 9.2% వరకూ ఉన్నాయి. ఇవి ఆసియాలో పాకిస్థాన్(11.3%) తర్వాత మరే దేశంలోని వసూలు కాని రుణాల కంటే మన దగ్గరే ఎక్కువ. రుణ గ్రహీత తీసుకున్న రుణం తాలూకు అసలును కానీ వడ్డీని కాని కట్టకుండా వరుసగా మూడు నెలలు ఆపేస్తే అది మొండిబకాయిల కింద పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఉన్న భారతదేశ స్థూల నిరర్దక ఆస్తుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. గత ఆరేళ్లలో ఇవి బాగా పెరిగినట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2011లో బ్యాడ్ లోన్స్ 2.7% గా ఉండగా అది 2015 కల్లా 5.88% కి పెరిగినట్లు, అదే 2016 సంవత్సరానికి 9.18 శాతానికి విపరీతంగా పెరిగినట్లు ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది.
ఆర్థిక మందగమనానికి మొండి బకాయిలే కారణం
గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత దేశ ఆర్థిక పురోగతి మందగించడానికి ప్రభుత్వం చెబుతున్న నిధు ల కొరతగాని, జిఎస్టి అమలులో గందరగోళంగాని కారణాలు కావు. ఆర్థిక వ్యవస్థను పట్టి పల్లార్చుతున్నది కార్పొరేట్ రుణాలే. దేశంలోని ఐదోవంతు కార్పొరేట్ సంస్థలు రుణ బకాయిలను చెల్లించడం లేదు. అందుకు సరిపోయేంత ఆదాయం అవి గడించడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీల తాజా వార్షిక ఆదాయ నివేదికలు చెబుతున్న దాన్ని పరిశీలించి థాంప్సన్ రాయటర్స్అందించిన సమాచారం ప్రకారం గత మార్చి ఆఖరుకుగల ఏడేళ్లలో దేశ కార్పొరేట్ రుణం అత్యధిక స్థాయిని చేరింది. పెద్ద కంపెనీలలో ఐదోవంతు ఆదాయం సరిగా లేక తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లించలేకపోతున్నాయి. జూన్తో ముగిసిన త్రై మాసంలో జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి )5.7కు పడిపోయినట్లు ప్రభుత్వం ఆగస్టు 31న తెలిపింది. ఇది చాలా దేశాల కంటె మెరుగే కావచ్చు కాని మన దేశంలో 2014 ఆరంభంలో కంటె చాలా అధ్వాన్నం.
నగదు కొరతకు కారణం కూడా ఇదే
పన్ను చెల్లింపుదారు దాచేసిన డబ్బును బయటకు రాబట్టాలని ప్రభుత్వం ప్రయత్నించడమే ఈ పరిస్థితికి దారి తీసినట్లు ఆరోపణలు వినిపించాయి. అదే నగదు కొరతకు కారణమని వారి వాదన. సరకులు, సేవల పన్ను(జిఎస్టి)లో భాగంగా దేశమంతటికీ వర్తించే సాధారణ అమ్మకం పన్ను విధించడంతో వ్యాపారులు, వినియోగదారులలో గందరగోళం నెలకొని లావాదేవీలు అట్టడుగును తాకాయి. బ్యాంకుల బాలెన్స్ షీట్ల లో కంపెనీల రుణ బకాయిలు పెరగడం పట్ల దేశ వ్యాపార రంగంలోని ఉన్నత స్థాయి ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక దిగజారుడుకు అదే ముఖ్య కారణమంటున్నారు. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ)ప్రకటించిన వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాలు కార్పొరేట్ రుణ బకాయిలు పెరగడంతో వమ్ము అవుతున్నాయని తెలిపారు. ఆ సమస్య దేశ ఆర్థిక స్తోమతను దెబ్బ తీస్తున్నట్లు చెబుతున్నారు.
4. 288 కంపెనీల అప్పులే 281 బిలియన్ డాలర్లు
2015 జనవరి నుంచి ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను 2% మేర తగ్గించింది. కాని వాణిజ్య బ్యాంకులు ఇంకా తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు నిపుణులు విమర్శిస్తున్నారు. చాలా పెద్ద కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కొనసాగించాలా లేదా కొత్త వ్యాపారం చేపట్టాలా నిర్ణయించుకోలేని సందేహంలో మునిగి ఉన్నాయి. థాంప్సన్ రాయిటర్స్ సమాచారం ప్రకారం దేశంలోని అత్యంత పెద్దవైన 288 కంపెనీల రుణం మార్చి నాటికి ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.18 ట్రిలియన్ స్థాయిని చేరాయి. డాలర్లలో 281 బిలియన్లకు సమానం.
5. వడ్డీ రేట్లు తగ్గింపుకు-ద్రవ్యోల్బణానికి లంకె
మార్చి నాటికి బ్యాంకు రుణాల మొత్తంలో ఎప్పటికీ వసూలు కాని కఠిన బకాయిలు 12 శాతం. మొత్తం 513 భారత కంపెనీల్లో సుమారు 5వ వంతు కంపెనీలు తీసుకున్న అప్పులకు ఒక శాతం కంటే తక్కువగా వడ్డీ చెల్లించాయి. దీంతో కొత్తగా రుణాలివ్వడం బ్యాంకులకు జఠిల సమస్యగా మారింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంకుల రుణాల మంజూరులో వృద్ది రికార్డు స్థాయిలో పడిపోయింది. దీని ప్రభావం జీడీపీ వృద్ది రేటులో ప్రతిఫలిస్తోంది. ప్రైవేటు పరిశ్రమకు గీటురాయి అనదగ్గ స్థూల పెట్టుబడి తయారీ జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో 30% కంటే తక్కువకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇది 31% కాగా, దశాబ్దం క్రితం ఇది 36%గా ఉండేది. వినియోగదారుల ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనల కారణంగా వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్బీఐ వెనుకంజ వేస్తోంది. ఆర్బీఐ అధికారులు ఈ అంశాన్ని కేవలం బ్యాంకులకు సంబంధించిన అంశంగానే భావిస్తుండటం దురదృష్టకరం.
6. బ్యాంకులకు తగిన మూలధన అవసరం
ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులకు మరింతగా నిధులను సమకూర్చాల్సిందిగా తరచూ ఆర్బీఐ ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. మన బ్యాంకులకు కూడా తగినంతగా అదనపు పెట్టుబడి ధనం అవసరం. ఈ డబ్బు ప్రభుత్వం నుంచే రావాలని ఆర్బీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దేశంలోని బ్యాంకులకు అదనంగా 65 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడి నిధులు అవసరం అవుతాయని ఫిచ్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. అందులో 95 శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక సహాయ సంస్థల నుంచి 2019 నాటికి రావాల్సి ఉంటుంది.
7. బడ్జెట్ కేటాయింపుల్లో తగినంత మూలధనం బ్యాంకులకు ఇవ్వట్లేదు
బడ్జెట్లో ఇందుకు కేటాయించిన 11 బిలియన డాలర్ల మొత్తం కంటే బ్యాంకుల మూలధన అసవరాలు చాలా ఎక్కువ. బ్యాంకులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తునే ఉంది. అయితే అదనపు పెట్టుబడి ధనం మాత్రం బ్యాంకులకు అవసరమైనప్పుడు చేరడం లేదు. అందుకు బదులుగా ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కట్టబెట్టే మార్గాన్ని అనుసరిస్తోంది. కంపెనీలను దివాళా నుంచి తప్పించే అధికారాలను విశేషంగా ఆర్బీఐకి ఇటీవలే కల్పించారు. అయితే ఈ మార్గంలో బ్యాంకులకు మంచి జరగాలంటే మాత్రం చాలా కాలం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులకు అదనపు పెట్టుబడి ధనం సమకూర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. అయితే ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది.
8. మారిన ప్రభుత్వ తీరు
మొండి బకాయిల సమస్యను తీర్చేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రభుత్వం కనిపించడం లేదు. బ్యాంకులను కలిపేసి కొన్ని పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను చిన్న దానిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు వివిధ రేటింగ్ సంస్థల హెచ్చరికలతో రఘురామ్ రాజన్ సూచనపై కేంద్రం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే బ్యాంకుల రంగానికి మొండి బకాయిల భారం తీరడం చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. అదనపు పెట్టుబడి ధనం బ్యాంకులను కష్టాలనుంచి తప్పించాలంటే మొండి బకాయిల సమస్య తీరాలని వారు సూచిస్తున్నారు. అప్పుడే బ్యాంకులు మరింతగా రుణాల మంజూరీ చేయగలుగుతాయి.
9. ఇదే సమస్యకు పరిష్కారం
రుణాల మంజూరు వల్ల బ్యాంకులకు వడ్డీల రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు డిపాజిట్లు పెరిగాయి. డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీలు చెల్లించడం విధిగా చేయాలి. అంటే ఆదాయాన్ని కోల్పోవడమే బ్యాంకులకు ఉన్న మార్గం. ఈ పరిస్థితి నుంచి బ్యాంకులు గట్టెక్కాలంటే ఎగ్గొట్టిన కార్పొరేట్ రుణాల వసూలుకు సమాయత్తం కావాలి.
10. ప్రజల సమస్య ఇదీ... బ్యాంకుల బాధ అదీ...
నోట్లరద్దు, జిఎస్టి పరిణామాలతో సాధారణ ప్రజలు, మొండి బకాయిలతో బ్యాంకులు కునారిల్ల్లుతున్నాయి. దేశంలో నల్లడబ్బు సమస్య పెరగడానికి బ్యాంకుల మొండి బకాయిలు పెరగడానికి మధ్య సంబంధం ఉంది. బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని, వ్యాపారంలో నష్టాలు చూపించి తిరిగి చెల్లించకుండా కొంత మంది బడా బాబులు అక్రమ సంపాదనకు మరిగారు. బ్యాంకు రుణాల మంజూరీలో వృద్ధి మందగించడం కొత్త పరిశ్రమల ఏర్పాటు సన్నగిల్లడానికి కారణం అవుతుంది. ఈ సమస్యపై తక్షణం దృష్టిపెట్టి ప్రభుత్వం కదలాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.