త్వరలో పోస్ట్మెన్ల చేతికి చిన్నపాటి ఏటీఎమ్లు
పోస్టల్ డిపార్ట్మెంట్ ( తపాలాశాఖ) ఆర్థిక సేవల్లోకి పూర్తిగా అడుగిడనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అందరూ పోస్ట్మెన్లకు 2018 చివరిలోగా 1లక్షా యాభై వేల మైక్రో ఏటీఎమ్లు ఇచ్చే దిశగా ప్రయత్నాలు
సమాచార సాంకేతిక విప్లవంలో తన ప్రాముఖ్యతను కోల్పోతున్న భారత తపాలా శాఖ తిరిగి పూర్వవైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు గాను తమకు అందివచ్చిన 'ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్' (ఐపిపిబి) అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి భారత పోస్టల్ శాఖ ఐపిపిబి సేవలను మొదలు పెట్టనుంది. అయితే గతంతో అనుకున్న విధంగా దేశంలోని అన్ని పోస్టాఫీ సులను బ్యాంకులుగా మార్చి సేవలను అందించాలన్న ఆలోచనతో పాటు పోస్టల్ శాఖ ప్రజలకు మరింత చేరువ య్యేందుకు ఉన్న అన్ని ఇతర అవకాశాలను పరిశీలిస్తోంది.దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
1. ఇంటి వద్దే డజనుకు పైగా సేవలు..
పేమెంట్ బ్యాంకు సేవలను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్న భారత తపాలాశాఖ తమ సేవల విస్తరణలో భాగంగా డిపాజిట్ల కంటే కూడా చెల్లింపులను ఆధారంగా చేసుకొని విస్తరించాలని భావిస్తోంది. భారత పోస్టల్ శాఖకు కీలకంగా నిలిచే పోస్ట్మెన్ల సేవలను ఇందుకు వినియోగించుకొనేలా ప్రణాళికను రూపొందించుకుంటోంది. తమ ప్రణాళికలో భాగంగా దేశంలోని దాదాపు 1.50 లక్షల మంది పోస్ట్మెన్లకు ఏటీఎమ్ లాంటి చిన్న పరికరాన్ని అందించనుంది.
2. 12 రకాల సేవలు
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ప్రింటర్తో పాటు వేెలిముద్రలను గుర్తించేలా ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని భారత తపాల శాఖ తయారు చేయిస్తోంది. ఈ పరికరంతో పోస్ట్మెన్లు ఇంటి వద్దకే వచ్చి విద్యుత్తు బిల్లులు, నల్లా బిల్లులు, మొబైల్ రిచార్జ్, డిటిహెచ్, స్కూలు ఫీజులు, బ్యాంకు చెల్లింపులు, నెలవారీ కిస్తీల చెల్లింపులతో పాటు గ్రామంలో షాపింగ్ వంటి దాదాపు డజనుకు పైగా చెల్లింపులను స్వీకరించేలా ప్రణాళికలను తయారు చేసింది. దీనికి తోడు ప్రభుత్వ అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల సొమ్మును కూడా పోస్ట్మెన్ ద్వారానే ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఇప్పించేలా సర్కారుతో తపాలా శాఖ చర్చలు జరుపుతోంది.
3. రెండు లక్షల ఏటీఎమ్ల కొనుగోలు..
భారత తపాలా శాఖ దేశ వ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసులతో దేశంలో మూలమూలన విస్తరించి ఉంది. బ్యాంకింగ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేని ప్రాంతాల్లో సైతం తపాలా శాఖ బలమైన నెట్వర్క్ను కలిగి ఉంది. ఇదే అంశాన్ని తమకు అనువుగా మార్చుకోవాలని భారత పోస్టల్ శాఖ యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను పొందాలంటే దాదాపు 10-25 కి.మీ. మేర ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఉంది. ఏటీఎమ్ సౌకర్యాలు కూడా అందరికీ అందుబాటులో లేవు. దీంతో మైక్రో ఏటీఎమ్ ద్వారా చెల్లింపులతో పాటు గ్రామీణులు ఏటీఎమ్ మాదిరిగానే చిన్న మొత్తంలో నగదును అందించేలా తమ యాప్ను రూపొందిస్తోంది. ఇందుకోసం ఐటీ దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పోస్ట్మెన్కు టెక్నాలజీని అందించడం ద్వారా తమకున్న నెట్వర్క్తో తిరిగి పూర్వవైభవం సాధించవచ్చన్నది తపాలా శాఖ ప్రణాళికగా ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా తపాలా శాఖ దాదాపు 2 లక్షల మైక్రో ఏటీఎమ్ల కొనుగోలుకు గాను త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. వీటికి బ్యాక్ఎండ్ ఇంటిగ్రేటర్గా హెచ్పిని భారత తపాలా శాఖ ఇప్పటికే ఎంపిక చేసుకుంది.
4. ఇప్పటికే 35 కోట్ల ఖాతాలు..
భారత తపాలా శాఖ ఇప్పటికి దేశ వ్యాప్తంగా దాదాపు 35 కోట్ల ఖాతాలను కలిగి ఉంది. రానున్న 5 ఏళ్ల కాలంలో దాదాపు 8 కోట్ల కుటుంబాల వారికి భారత తాపాలా శాఖ పేమెంట్ బ్యాంకు సేవలను విస్తరించాలని ఐపిపిబి అధికారులు చెబుతున్నారు. నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించాలని భావిస్తున్న సర్కారు లక్ష్యాన్ని గ్రామాలకు తీసుకుపోయేందుకు తమ సేవలు ఎంతగానో దోహదం చేస్తాయని, గ్రామీణుల నగదు చెల్లింపులు, బ్యాంకు అవసరాలను కూడా తాము గరిష్టంగా తీర్చగలమన్న విశ్వాసాన్ని తపాలా శాఖ వ్యక్తం చేస్తున్నది. తమ ప్రణాళిక అనుకున్న ప్రకారం అమలైతే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే భారత తపాలా శాఖ పూర్వవైభవం సంతరించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ శాఖ అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
5. తపాలా శాఖ గురించి క్లుప్తంగా
భారతీయ తపాలా శాఖ అత్యధిక మంది ఉద్యోగులు పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. 163 ఏళ్ల క్రితం ఇది ప్రారంభమైంది. మార్చి 2015 నాటికి ఈ శాఖ కింద 1,54,939 కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 1,39,222 గ్రామీణ ప్రాంతాల్లో, 15,826 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మార్చి 2016 నాటికి దాదాపుగా 4,48,840 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత, రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ-కామర్స్ ఉత్పత్తులను సైతం క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా వినియోగదారులకు చేరవేసే పనిని తపాలా శాఖ ముందుకు తీసుకెళుతోంది.