మరో 40 మొండి బకాయిలున్న కంపెనీల జాబితా సిద్దం
ఇటీవల కాలంలో ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్బీఐ తాజాగా మరో 30- 40 కంపెనీలపై చర్యలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 40కిపైగా కంపెనీల పేర్లతో ఒక జాబితాను తయారు చేస్తోందని సమ
ఇటీవల కాలంలో ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్బీఐ తాజాగా మరో 30- 40 కంపెనీలపై చర్యలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 40కిపైగా కంపెనీల పేర్లతో ఒక జాబితాను తయారు చేస్తోందని సమాచారం. కొత్త జాబితాలో వీడియోకాన్, కాస్టెక్స్ టెక్నాలజీస్, విసా స్టీల్, జెఎస్పిఎల్ తదితర కంపెనీలు ఉండొచ్చని ఎకనమిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో అధిక శాతం కంపెనీలు ఇన్ఫ్రా, విద్యుత్ రంగాలకు చెందినవి. సీఎన్బీసీ-టీవీ18 కథనం ప్రకారం ఈ జాబితాలో వీడియోకాన్, జేపీ అసోసియేట్స్, ఐవీఆర్సీఎల్, విసా స్టీల్ వంటివి ఉండొచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్లో ఈ జాబితాను విడుదల చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వార్తల నేపథ్యంలో జాబితాలో ఉండొచ్చని అనుమానం ఉన్న కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విసా స్టీల్ 1.24 శాతం, వీడియోకాన్ 3 శాతం, ఉత్తమ్గాల్వా అర శాతం, జెఎస్పిఎల్ 2.5 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. ఈ కంపెనీల షేర్లన్నీ గత కొన్ని నెలలు, సంవత్సరాలుగా నేల చూపులు చూస్తునే ఉన్నాయి. జాబితా తయారీ అనంతరం ఆయా కంపెనీలపై చర్యలకోసం ఎస్సిఎల్టిని సంప్రదించాలని అప్పులిచ్చిన బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలివ్వనుంది. ఇప్పటికే ఇలాంటి డజను ఎగవేత కంపెనీలతో ఆర్బిఐ ఒక జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేర్కొంటున్న కంపెనీలన్నీ కలిపి సుమారు 1.75 లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయి ఉండవచ్చని అంచనా. ఇది బ్యాంకుల మొత్తం స్థూల ఎన్పిఎల్లో సుమారు 25 శాతం.