ప్రీమియం కట్టారు... అయినా పరిహారం రాలేదు...
భారతదేశంలో 60 శాతం పైగా జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. అయితే ఒకసారి అధిక వర్షాలు, మరోసారి కరువులు, వాతావరణ మార్పులు వంటి వాటి కారణంగా రైతులు ఆర్థికంగా చితికిపోతుంటారు. దీన్ని దృష్టిలో పె
భారతదేశంలో 60 శాతం పైగా జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. అయితే ఒకసారి అధిక వర్షాలు, మరోసారి కరువులు, వాతావరణ మార్పులు వంటి వాటి కారణంగా రైతులు ఆర్థికంగా చితికిపోతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 13,106 నాడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనే పంట బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పంట బీమా పథకం "ఒక దేశం- ఒక పథకం" అనే నినాదంతో పనిచేస్తుంది. దీనికి సంబంధించి ముఖ్య అంశాలను తెలుసుకుందాం.
1. పథకం లక్ష్యాలు
ప్రకృతి వైపరీత్యాలు, క్రిమి కీటకాలు, లేక వ్యాధుల వల్ల పంట నష్టం కలిగినచో రైతుకు ఆర్థిక సాయం, బీమా కవరేజీ లభిస్తుంది.
వ్యవసాయంలో కలిగే నిరంతర ఆటంకాల మూలంగా రైతుకు నిలకడ ఆదాయం ఉండేలా హామీ కల్పించుట. స్థిరమైన ఆదాయానికి భరోసానివ్వడం
నూతన, అభివృద్ది చెందిన విధానాలలో వ్యవసాయం చేయుటకు ప్రోత్సహించుట
రైతులకు నిరంత పంట రుణ హామీ, వ్యవసాయ రంగానికి రుణాలు బాగా ఇచ్చేలా చూడటం.
2. ఫసల్ బీమా ముఖ్యాంశాలు
అన్ని రబీ పంటలకు 2%, ఖరీఫ్ పంటలకు 1.5% ఏకరీతి ప్రీమియాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక వాణిజ్య, తోటల విషయంలో రైతులు చెల్లించే ప్రీమియం కేవలం 5% ఉంటుంది.
రైతులు చెల్లించే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. సమతుల్యత ప్రీమియం వల్ల రైతులకు పంట నష్టం జరగకుండా రైతులకు పూర్తి బీమా మొత్తాన్ని అందించడానికి సహజ విపత్తుల ఖాతా నుంచి ప్రభుత్వం చెల్లిస్తుంది.
ప్రభుత్వ సబ్సిడీపై ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. సమతుల్యత ప్రీమియం 90% అయినప్పటికీ అది ప్రభుత్వం భరిస్తుంది.
అంతకు ముందు ఉన్న పథకాలలో ప్రీమియం రేటు క్యాపింగ్ ఉండటం వల్ల రైతులకు తక్కువ క్లెయింలు అందేవి. ఈ ప్రీమియం క్యాపింగ్ సబ్సిడీ వల్ల ప్రభుత్వ చెల్లింపులు పరిమితంగా ఉండేవి. ఈ క్యాపింగ్ ప్రస్తుతం తొలగించబడిన కారణంగా రైతులు పూర్తి బీమాను పొందుతారు.
చాలా వరకూ టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహిస్తారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి పంట కోతకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం వల్ల రైతులకు జరగాల్సిన చెల్లింపుల్లో ఆలస్యం కాదు. రిమోట్ సెన్సింగ్ పంట కోత ప్రయోగాల సంఖ్య తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనం ఇంతకుముందు ఉన్న వ్యవసాయ బీమా పథకాలన్నింటినీ కలుపుతుంది. ఈ బీమాకు అన్ని సేవా పన్నుల్లో మినహాయింపు ఉంటుంది.
3. బీమా పరిధిలో...
నోటిఫై ప్రాంతంలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేసిన అందరు రైతులు పంట బీమాకు అర్హులు.
ఆహార పంటలు, నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు ఈ కవరేజీకి అర్హత కలిగి ఉంటాయి.
4. ఏ సందర్భాల్లో కవరేజీ?
ఈ కింద చెప్పిన దశల్లో పంట నాశన ప్రమాదాలకు బీమా కవరేజీ ఉంటుంది
* విత్తు నాటడానికి అంతరాయం లేదా మొక్క నాటడానికి ఇబ్బంది:
ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేక అనావృష్టి వల్ల పైన చెప్పిన ఆటంకం కలిగితే
* పంట సాగుచేసి కోత సమయంలో ఇబ్బంది వస్తే
సాగుచేయబడి కోతకు సిద్దం కాని లేదా పంట ఫలం చేతికి రాకపోతే
అంటే అతివృష్టి లేదా తుఫాన్ లేదా అగ్ని ప్రమాదం లేదా కరువు లేదా కొండ చరియలు విరిగి పడటం లేదా క్రిమి కీటకాలు మొదలగు ప్రకృతి సిద్దమైన వైపరీత్యాల వల్ల పంట నష్టం కలిగితే సమగ్ర కవరేజీ ఉంటుంది.
* సాగు తర్వాత కలిగే నష్టాలకు
కోతకు సిద్దమైన లేదా పొలంలోనే ఆరేసిన పంటకు రెండు వారాల వరకూ తుఫాన్ లేదా అకాల వర్షాల వల్ల కలిగే నష్టములకు కూడా బీమా కవరేజీ లభిస్తుంది
* స్థానిక విపత్తులు
కొన్ని ప్రకటించిన ప్రదేశాల్లో స్థానికతకు చెందిన విపత్తులు అనగా కొండ చరియలు విరిగి పడుట, వడగండ్ల వానలు మొదలగు వాటికి కూడా కవరేజీ ఉంది.
5. బీమా యూనిట్
ఈ పథకాన్ని 'ఏరియా అప్రోచ్ ఆధారంసగా అమలు చేస్తారు. అనగా వైపరీత్యాల ఆధారంగా ప్రతి పంటకు "నోటిఫై ఏరియా"లను గుర్తిస్తారు. ఈ ప్రాంతాలలోని రైతులందరినీ ఒక బీమా యూనిట్గా భావిస్తారు. ఒక యూనిట్ రైతులందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఒక హెక్టారుకు అయ్యే ఖర్చు కూడా ఒకే రకంగా ఉంటుంది. హెక్టారుకు వచ్చే సంపాదన, సంభవించే పంట నష్టం దాదాపు ఒకేలా ఉంటాయి.
ముఖ్య పంటలకు నిర్వచించిన ప్రాంతంగా గ్రామం లేదా గ్రామ పంచాయతీ స్థాయిలో ఏ పేరుతో వీటిని పిలిచినా గుర్తిస్తారు. ఇతర పంటలకు గ్రామం లేదా గ్రామ పంచాయతీ ప్రాంతాల కంటే పెద్ద ప్రాంతాన్ని తీసుకుంటారు. కొంత కాలం తర్వాత, ఒకే రకమైన ప్రమాదాలు గల నోటిఫై పంటల బీమా యూనిట్ జియో-ఫెన్స్డ్ లేదా జియో మ్యాప్ కావొచ్చు.
6. పంటల బీమా పథకం అమల్లో లోపాలు: కాగ్
రైతులు బీమా చెల్లించినా సకాలంలో వారికి నష్టపరిహారం అందడం లేదు. బీమా పథకం అమల్లో లోపాల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను రైతుల తరపున బీమా కంపెనీలకు చెల్లించినా లబ్దిదారులను గుర్తించడంలో అలసత్వం ఉంది. లబ్దిదారుల వివరాలను సరిగా నమోదు చేయడంలో అటు వ్యవసాయ అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, బీమా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ విఫలం చెందాయని కాగ్ నివేదికలో తప్పు పట్టింది.
7. ఇటీవలి కాగ్ నివేదిక
గత 5 సంవత్సరాల కాలంలో పంట బీమా పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.32,606 కోట్లు ఖర్చు పెట్టాయి. పంట బీమా పథకాలపై రైతులకు ఇచ్చే సబ్సిడీల రూపంలో ఈ మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించేశారు. అయితే లబ్దిదారులెవరో, క్లెయిం చెల్లింపులను ఏ విధంగా కేటాయించారో అన్న లెక్కలు మాత్రం నమోదు కాలేదని కాగ్ నివేదిక పేర్కొంది.
8. ప్రభుత్వ అలసత్వం
సకాలంలో రైతులు, రైతుల తరపున ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియం డబ్బు చెల్లించినా తర్వాత జరగాల్సిన పని జరగడం లేదు. లబ్దిదారులు ఎవరో అన్న వివరాలపై లెక్కలు అందుబాటులో లేవని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. 2011-12 నుంచి 2015-16 మధ్య జరిపిన ఆడిటింగ్ తర్వాత వెల్లడి అయిన సమాచారం ప్రకారం లబ్ది పొందిన రైతుల గురించి గానీ సంబంధిత బీమా సొమ్ము ఎంత అనేది కానీ నమోదు చేయలేదు. ప్రభుత్వం ఈ వివరాలను లెక్కచూపే పరిస్థితిలో లేదని కాగ్ అభిప్రాయపడింది. ఈ సమాచారం కోసం బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని ఆడిటింగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.
9. కంపెనీల కలెక్షన్
32 శాతం మందికి మాత్రమే క్లెయిం పరిహారం లభించిందని పేర్కొంది. ప్రీమియం రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. బీమా ప్రీమియం గుజరాత్లో 20.5%, రాజస్థాన్లో 19.9%, మహారాష్ట్రలో 18.9%గా ఉంది. సరాసరి ప్రీమియం ధర చూస్తే 12.6%గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి బీమా సంస్థలు వసూలు చేసిన ప్రీమియం మొత్తం రూ.22 వేల కోట్లు. వీటిలో సింహ భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. రైతులకు భరించే బీమా ప్రీమియం 1.5% నుంచి 5 శాతం దాకా ఉంటుంది.
10. సీఎస్ఈ అధ్యయనంలోని లెక్కలు
అధ్వానంగా ప్రీమియం చెల్లింపులు జరుగుతున్నాయని సీఎస్ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. పథకం అమలు ప్రకారం స్మార్ట్ఫోన్లు, శాటిలైట్ల, డ్రోన్ల సాయంతో పంట నష్టం, బీమా పరిహారం లెక్కింపు వేగవంతంగా జరగాలి. వాస్తవానికి గ్రామ స్థాయిలో అలా జరిగిన దాఖలాలు లేవు. రైతుల పంటలను, భూములను పరిశీలించకుండానే జిల్లా స్థాయి అధికారులు లెక్కలు వేసేస్తున్నారు. బీహార్, పశ్చిమ బంగాల్లో బీమా కంపెనీలు వరుసగా రూ.1423 కోట్లు, రూ.731 కోట్లు ప్రీమియం రూపంలో డబ్బు సేకరించినప్పటికీ, రైతులు రూ.1 కోటి కంటే తక్కువ నష్టపరిహారాన్ని పొందారు. అదే విధంగా తెలంగాణలో రూ.311 కోట్లు ప్రీమియం రూపంలో బీమా కంపెనీల చేతుల్లోకి వెళ్లింది.
క్లెయిం అంచనాలు రూ.174 కోట్ల వరకూ ఉన్నా, రైతులకు ఎటువంటి చెల్లింపులు జులై చివరి వరకూ జరగలేదు.