ఈ ఉత్తమ హోటల్స్తో మీ సమ్మర్ను ఉత్సాహంగా గడపండి
విహార యాత్రలకు వెళ్లాలంటే సమ్మర్లోనే అందరికీ కుదురుతుంది. అయితే ఎక్కడికైనా వెళితే ఎక్కడ మంచి వసతి దొరుకుతుందా అనేది ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న మ
ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమ జీడీపీకి 7.5 శాతం వాటాను సమకూరుస్తున్నది. అంతేకాకుండా విదేశీ మారకనిల్వలను దేశానికి రప్పించడంలో పర్యాటక పరిశ్రమ 3వ స్థానంలో ఉంది. దేశంలో 21 కేంద్ర ప్రభుత్వ హోటల్ మేనేజెమ్ంట్ సంస్థలు ఉన్నాయంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రంగంలో ప్రతి 10 లక్షల డాలర్ల పెట్టుబడుల వల్ల 78 ఉద్యోగాలు వస్తాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మధ్య తరగతి కూడా బడ్జెట్ హోటళ్లను వదిలి సర్వీస్ బాగుంటే ఖరీదైన హోటళ్లకే మొగ్గుచూపుతున్న రోజులివి. మరోవైపు వాతావరణాన్ని చూస్తే అప్పుడే చలికాలం ముగిసింది. ఎండలు పెరగడం ప్రారంభమైంది. ఎండాకాలం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. పిల్లలకైతే సెలవులు కాబట్టి ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎటైనా విహార యాత్రలకు వెళ్లాలంటే సమ్మర్లోనే అందరికీ కుదురుతుంది. అయితే ఎక్కడికైనా వెళితే ఎక్కడ మంచి వసతి దొరుకుతుందా అనేది ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న మంచి లగ్జరీ హోటల్స్ వివరాలను మీ కోసమే సేకరించాం. ఇంకేటి ఆలస్యం చదవండి.
1. తాజ్ లేక్ ప్యాలెస్, ఉదయ్పూర్
ఉదయ్పూర్ తాజ్ లేక్ ప్యాలెస్లో ఒకసారి బస చేశారంటే దీనికంటే ఉత్తమమైన హోటల్ ఏదీ లేదనేలా ఉంటుంది. వర్ణించలేని హాస్పిటాలిటీ, అవార్డ్ విన్నింగ్ రెస్టారెంట్లు, సాటి రాని సేవలు వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. ఇందులో 60కి పైసా రూమ్లు, 17 సూట్లు ఉన్నాయి. అన్నింటిలోనూ అత్యాధునిక సౌకర్యాలైన ఎల్సీడీ తెరలు కలిగిన టీవీలు, ఎలక్ట్రానిక్ భద్రత, మినీ బార్, టీ/కాఫీ మేకర్, అటాచ్డ్ వాష్రూమ్ వంటివి ఉంటాయి. అంతేకాకుండా హోటల్లో కాన్పరెన్స్ రూమ్ ఉంటుంది. ఆహారం విషయానికి వస్తే భారతీయ, అంతర్జాతీయ రుచులన్నీ ఇక్కడ లభ్యమవుతాయి.ఇక్కడి రెస్టారెంట్లలో ఇన్డోర్, అవుట్డోర్ సీటింగ్ అందుబాటులో ఉంటుంది.
2. ది లీలా ప్యాలెస్, ఉదయ్పూర్
ది లీలా ప్యాలెస్ గ్రూప్ ముంబయిలో మొదట హోటళ్ల సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఉదయ్పూర్లో హోటల్ను 2009 నుంచి ప్రారంభించింది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.
నాజూకైన ఇండియన్ కార్పెట్ మీకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. ప్రయాణికులకు నమ్మశక్యం గాని అవకాశాలైన లాడ్జింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది. ఇక్కడకు వచ్చిన వారెవరైనా ప్రసిద్ద రాజస్థానీ వంటకాలను తినకుండా వెళ్లలేరు. ఆహ్లాదకరమైన వాతావారణం ఉదయ్పూర్ సొంతం. ఎంతో సాంస్కృతిక వారసత్వం కలిగిన ఈ నగరంలో ఈ లీలా ప్యాలెస్ నిర్మాణం అద్వితీయం. పడవల్లో కానీ లేదా కార్లలో కానీ వచ్చి చూసేవారికి బాహ్య నిర్మాణం అబ్బురపరిచే విధంగా ఉంటుంది.
3. ది తాజ్ మహల్ ప్యాలెస్ , ముంబయి
దేశంలోనే పురాతనమైన ఫైవ్ స్టార్ హోటల్స్లో ది తాజ్, ముంబయి ఒకటి. ఇది 560 రూములను, 44 సూట్లను కలిగి ఉంది. ప్రస్తుత ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వీటి నిర్మాణం జరిగింది. భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించే హోటల్గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విదేశీ అతిథులు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రఖ్యాత వ్యాపారవేత్తలు, పరిశ్రమల అధినేతలు, సినీ తారలు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. ది తాజ్, ముంబయి అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 20 మైళ్ల దూరంలో ఉంది. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, ఏంజెలినీ జోలి వంటి సెలబ్రిటీలు ముంబయి వస్తే దీనివైపే మెగ్గుచూపుతారు. ఇక్కడ భారతీయ, చైనీస్, ఇటాలియన్, ఖండాంతర రుచులు యాత్రికులను నోరూరించేలా చేస్తాయి.
4. ది ఓబెరాయ్ అమర్విలాస్, ఆగ్రా
ప్రపంచంలోనే పురాతన రిసార్ట్స్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఈ హోటల్ సౌకర్యవంతమైన, సరికొత్త అనుభూతినిచ్చే రూములతో నిర్మించబడి ఉంది. ఆగ్రా అంటేనే మనకు గుర్తొచ్చేది తాజ్ మహల్. ఆ ప్రపంచ గుర్తింపు పొందిన కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇది ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ రాజసాన్ని ఉట్టిపడేలా ఉంటుంది. అతిథులు స్పా అనుభూతి, యోగా తరగతులు వంటి వాటితో ఇన్నర్ ఇంజినీరింగ్కు అవకాశం ఉండేలా ఇక్కడ వసతులు ఉంటాయి. ఇక్కడకు వచ్చిన ఢిల్లీలోని ప్రముఖ యాత్రా ప్రదేశాలను సైతం చూడక మానరు.
5. తాజ్ ఫలక్నామా ప్యాలెస్ , హైదరాబాద్
2015 సంవత్సరానికి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ప్యాలెస్ హోటల్గా మన తాజ్ ఫలక్నామా ఎంపికైంది. ప్రఖ్యాత టూరిజం, ట్రావెల్ వెబ్సైట్ ట్రిప్ అడ్వైజర్ ప్రపంచవ్యాప్తంగా పలు పర్యాటకుల అభిప్రాయాలు, సమీక్షలను తీసుకుని తాజ్ ఫలక్నామాను బెస్ట్ ప్యాలెస్ హోటల్గా ఎంపికచేసింది. నిజాం పాలకుల వైభవం, రాజసం ఉట్టిపడేలా ఉన్న భవన నిర్మాణం; ఖరీదైన ఫర్నిచర్, భారీ షాండ్లియర్లు, చూపుతిప్పుకోలేని కుడ్య చిత్రాలు, పురాతన వస్తువులు, విలాసవంతమైన గదులు అతిథుల మనసును గెలుచుకుంటాయి. ఈ ప్యాలెస్ హోటల్లో 60 గదులు ఉంటాయి. ప్రతి దానిలో టీ/కాఫీ మేకర్, ఎలక్ట్రానిక్ సేఫ్, మినీ బార్, ఇంటర్ కమ్యూనికేషన్, శ్యాటిలైట్ టీవీ ఉంటాయి.
6. ది ఓబెరాయ్ గ్రాండ్ , కోల్కత
అత్యాధునిక నిర్మాణశైలి, మరిచిపోలేని సేవలు, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి వాటితో ఉల్లాసమైన నగర అనుభూతిని, ప్రశాంతమైన వసతి ఇక్కడి ప్రత్యేకత. ఈ హోటల్ మంచి డిజైన్ రూములు, ప్రస్తుత కాలానికి అవసరమైన సౌకర్యాలతో పాటు వారసత్వ నిర్మాణ శైలిని సైతం తనలో ఇముడ్చుకుంది. ఇక్కడ ఇంకా ఫిట్నెస్ సెంటర్, స్పా, ఇంటర్కామ్, పార్కింగ్, ఒక్కో గదికి ప్రత్యేకమైన కేర్ టేకర్ సర్వీస్ వంటివి ఉన్నాయి.
7. ఉమైద్ భవాన్ ప్యాలెస్, జోధ్పూర్
1928-43 మధ్య మహారాజా ఉమైద్ సింగ్ కోసం దీన్ని నిర్మించారు. ఒక సరికొత్త జోధ్పూర్కు ఈ హోటల్ నిర్మాణం తార్కాణంగా నిలుస్తుంది. ఈ ప్యాలెస్లో జోధ్పూర్లో ఎత్తైన స్థలమైన చిత్తార్ హాల్ నుంచి నీలి నగరాన్ని మొత్తం చూడొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 20 నిమిషాల ప్రయాణం. రైల్వే స్టేషన్ నుంచి హోటల్ ఒక మైలు దూరంలో ఉంది. సిటీలో చూపరులను ఆకట్టుకునే జశ్వంత్ థాడా, హెహ్రంఘర్ కోట, కల్యాణా సరస్సు, బల్సమండ్ సరస్సు వంటి ఇతర ప్రదేశాలు ఉన్నాయి.
8. ది లీలా ప్యాలెస్, న్యూఢిల్లీ
ఇండియా గేట్ నుంచి 3 మైళ్లు, సరోజిని నగర్ మార్కెట్ నుంచి ఒక మైలు దూరంలో ది లీలా ప్యాలెస్ ఉంది. ఆధునికత అడుగడునా సంతరించుకున్న చాణక్యపూరి ప్రాంతంలో ఇది ఉండటం మరో ప్రత్యేకత. విలాసవంతమైన వసతి సౌకర్యాలు, టాప్ హాస్పిటాలిటీ సేవలు దీని సొంతం. షాపింగ్; బిజినెస్ సెంటర్ల మధ్య ఉన్నందున మీకు దగ్గరివారితో కలిసి బయట కలియతిరిగేందుకు మంచి హోటల్ ఇది. సరికొత్త శక్తినిచ్చే స్పా థెరపీలు సైతం ఇక్కడ లభిస్తున్నాయి. ఇటాలియన్, జపనీస్, సంప్రదాయ ఇండియన్ రుచులు ఇక్కడ దొరుకుతాయి.ఇన్హౌస్ బార్లో వివిధ రకాల అంతర్జాతీయ లిక్కర్లు సైతం ఉంటాయి.
9. ది ఓబెరాయ్ గుర్గావ్
ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో మంచి బిజినెస్ హబ్గా పేరొందిన గుర్గావ్ ప్రాంతంలో ఈ లగ్జరీ హోటల్ ఉంది. 2011 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ హోటల్ కోసం దాదాపు 4 బిలియన్ రూపాయలు వెచ్చించారు. 202 రూములతో పాటు, 15 సూట్లు, 2 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇది మీ ఊహకు అందని వసతి అనుభూతిని ఇస్తుంది. విలాసం, సౌకర్యం, వినోదం సమపాళ్లలో ఉండేలా ఉన్నవాటిలో ఒబెరాయ్ గుర్గావ్ ఉత్తమమైనది. అతిథుల బసను సౌకర్యవంతంగా ఉండేలా చూసేందుకు 24 గంటల రూమ్ సర్వీస్ ఉంటుంది. 5 కన్నా ఎక్కువ కిచెన్లు ఆహారానికి ఇదిచ్చే ప్రాముఖ్యతను బయటపెడుతుంది. పియానో బార్లో అన్ని రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్ దొరుకుతాయి.
10. ది ఒబెరాయ్, ముంబయి
ఒబెరాయ్ హోటల్స్,రిసార్ట్స్ మరియు ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్ ముంబయిలోని నారిమన్ పాయింట్కు సమీపంలో ఉన్నాయి. ఈ రెండూ కూడా ఒబెరాయ్ హెటల్స్&రిసార్ట్స్ యాజమాన్యం కింద పనిచేస్తున్నాయి. ఇవి రెండు వేర్వేరే భవనాల్లో ఉన్నప్పటికీ రెండింటినీ కలుపుతూ ఒక వంతెన ఏర్పాటుచేశారు. రోజు మొత్తం వ్యాపార పనుల్లో భాగంగా నగరాన్ని చుట్టి లేదా చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టి వచ్చిన తర్వాత ఒబెరాయ్ ఒక రీఫ్రెషింగ్ అనుభూతిని ఇచ్చేందుకు సిద్దంగా ఉంటుంది. ఒబెరాయ్ స్పా, హెరిటేజ్ వాక్, అంతర్జాతీయ రుచులను కలిగిన రెస్టారెంట్లు, బార్లు ఇక్కడ ఉన్నాయి. అరేబియా సముద్రానికి ఎదురుగా ఒక పర్ఫెక్ట్ లొకేషన్ నారిమన్ పాయింట్ వద్ద ఈ హోటల్ ఉండటం చూపరులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.
11. ది ఒబెరాయ్ ఉదయ్విలాస్, ఉదయ్పూర్
ప్రపంచస్థాయి రొమాంటిక్ హోటల్స్లో ఉదయ్పూర్లోని ఒబెరాయ్ ఒకటి. 2015 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే 4వ బెస్ట్ ప్యాలెస్ హోటల్గా ఇది పేరు తెచ్చుకుంది. ఉదయపూర్ నగరంలోని పిచోలా సరస్సు ఒడ్డున దీన్ని నిర్మించారు. ఎయిర్ పోర్టు నుంచి 19 మైళ్లు, నగరం నడిబొడ్డు నుంచి 2 మైళ్ల దూరంలోని సులువుగా చేరుకోగలిగేలా ఉంది. ఒకనాటి రాజ వైభోగాలను గుర్తుకుతెచ్చేలా అక్కడి సదుపాయాలు ఉంటాయి. ప్రైవేటు డిన్నర్లు, మీ రూమ్ లేదా స్విమ్మింగ్ పూల్ వద్ద లేదా స్పా కోర్టు యార్డ్ లో చేయవచ్చు. ఉదయ విలాస్ లో సూట్లు కూడా ప్రైవేటు పూల్, గార్డెన్, కోర్టు యార్డ్ లు కలిగి వున్నాయి. మీ ప్రియమైన వారితో పూర్తి ప్రైవసి లో ఆనందించవచ్చు.
12. ది ఒబెరాయ్ వన్యవిలాస్ రణథంబోర్
ట్రిప్ అడ్వైజర్ రేటింగ్ ప్రకారం ఉత్తమ విలాసవంతమైన హోటళ్లలో ఇది ఒకటిగా పేరుతెచ్చుకుంది. దేశవ్యాప్త ప్రసిద్ది పొందిన రణథంబోర్ టైగర్ రిజర్వ్ను ఆనుకుని ఈ హోటల్ ఇంటి వాతావరణాన్ని మరిపించేలా ఉంటుంది. సవాయ్ మథోపూర్ రైల్వే స్టేషన్ నుంచి 5 కి.మీ దూరంలో ఉంది. రిసార్ట్ ఏర్పాటు చేసిన విధానం ఒళ్లు పులకరించేలా ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్, క్లోజ్డ్ గార్డెన్, విలాసవంతమైన వాష్రూంలతో పాటు లగ్జరీ టెంట్లను ఉంచి రిసార్ట్స్ను తయారుచేశారు.
13. తాజ్ రాంబాఘ్ ప్యాలెస్ జైపూర్
జైపూర్లోని అత్యంత విలాసవంతమైన హోటల్ తాజ్ రాంబాఘ్. ఒకప్పుడు ఇది మహరాజు వారి నివాసం. కళా నిర్మాణానికి ఉత్కృష్టమైన ఖ్యాతితెచ్చేలా రాంబాఘ్ పోలో మైదానంలో నిర్మించారు. ఈ హోటళ్లలో మొత్తం 79 రూములు ఉంటాయి. సామాజిక, వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాల కొరకు ఇక్కడ రెండు సమావేశ మందిరాలు, 5 హాల్స్ ఉంటాయి. రిక్రేయషన్ కో్సం అవుట్డోర్ స్విమ్మింగ్పూల్, స్పా, మినీ గోల్ఫ్ కోర్స్, ఫిట్నెస్ సెంటర్ వంటివి సైతం అందుబాటులో ఉంటాయి.
14. ఒబెరాయ్ రాజ్విలాస్, జైపూర్
పింక్ సిటీ రాజసాన్ని ఉట్టిపడేలా నిర్మించిన రిసార్ట్ ఇది. అందమైన ల్యాండ్స్కేప్డ్ ఉద్యానవనాల్లో 32 ఎకరాల్లో విస్తరించింది. రాజస్థానీ కోట శైలిలో దీన్ని నిర్మించారు. ఒకరాత్రి స్టే కోసం ఇక్కడ విల్లా ఖరీదు దాదాపు రూ.35 వేలుగా ఉంటుంది. ఒక గదిలో గరిష్టంగా ఇద్దరు ఉండొచ్చు. ఈ విలాసవంతమైన హోటల్లో 54 రూములు ఉంటాయి. అన్ని గదుల్లోనూ వైర్డ్ ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ సేఫ్, మినీ బార్, టీ లేదా కాఫీ మేకర్, 24 గంటల రూం సర్వీస్ వంటివి ఉంటాయి. దేశీయ, ఖండాంతర రుచులను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
15. ట్రైడెంట్, గుర్గావ్
ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు కలిగిన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. 5 దేశాల్లో 20కి పైగా హోటళ్లు, 2 క్రూజర్లు సొంతంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందుకున్న ఓబెరాయ్ గ్రూప్ హోటళ్లలో ఒబెరాయ్ హోటల్స్& రిసార్ట్స్ ఒకటి. 2004 నుంచి వరుసగా 4 సంవత్సరాల పాటు ట్రైడెంట్ హోటల్ ఉత్తమ ఫస్ట్ క్లాస్ హోటల్ బ్రాండ్గా గెలీలియో ఎక్స్ప్రెస్ అవార్డును అందుకుంది. సహజత్వం ఉట్టిపడేలా ఒబెరాయ్ ట్రైడెంట్ను నిర్మించారు. అన్ని గదుల్లోనూ ప్రత్యేక వాష్రూం,టీ/కాఫీ మేకర్, ఎలక్ట్రానిక్ సేఫ్ లాకర్, రూం సర్వీస్ వంటివి ఉంటాయి. కాల్ చేస్తే వచ్చే డాక్టర్ సదుపాయంతో పాటు లాండ్రీ సౌకర్యం గది లోపలే ఉంటుంది.