2017లో డిజిటల్ విధానాలు ఆర్థికవ్యవస్థను, వివిధ బ్రాండ్లను ఎలా ప్రభావితం చేస్తాయి?
ప్రతి రంగం స్మార్ట్ అవుతున్న కాలం ఇది. బిజినెస్లు సైతం విపరీతంగా సాంకేతిక మార్గాలను అందిపుచ్చుకుంటున్నాయి. టైర్-2,టైర్-3 నగరాలే కాదు చిన్న చిన్న పట్టణాలు సైతం డిజిటల్ విప్లవానికి అనుగుణ
ప్రతి రంగం స్మార్ట్ అవుతున్న కాలం ఇది. బిజినెస్లు సైతం విపరీతంగా సాంకేతిక మార్గాలను అందిపుచ్చుకుంటున్నాయి. టైర్-2,టైర్-3 నగరాలే కాదు చిన్న చిన్న పట్టణాలు సైతం డిజిటల్ విప్లవానికి అనుగుణంగా వ్యూహాలను మారుస్తున్నాయి. మన వ్యాపారంలో డిజిటల్ సాధనాలు, ప్రక్రియలను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామనే అనే అంశమే మిగతా పోటీదారుల నుంచి వేరు చేస్తుంది. ముఖ్యంగా యువత మొబైల్లో గడిపే సమయం పెరుగుతుండటం ప్రధానంగా అందరికీ లాభించే విషయం. ఈ నేపథ్యంలో 2017లో డిజిటల్ విప్లవం వ్యాపారాలను, బ్రాండ్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
1. మొబైల్ డిజిటల్ విప్లవం:
డిజిటల్ రహదారుల్లో మొబైల్ ద్వారా సమచారాన్ని చేరవేసే వారే రారాజులవుతారు. 2017లో మిస్డ్ కాల్ మార్కెటింగ్ ఒక సరికొత్త ఆవిష్కరణగా నిలుస్తుంది. అంటే ప్రజలకు ఇంటరాక్టివిటీ పెరగాలి. ఇందుకోసం బ్రాండ్లు వినియోగదారుల ఆసక్తులను తెలుసుకోగలగాలి. హైపర్లోకలైజేషన్ సంబంధించి ఉన్న సాధ్యాసాధ్యాలను గమనించి టార్గెట్ కస్టమర్లను చేరడంతో పాటు, వారికి అవసరమైన ఉత్పత్తుల గురించి తరుచూ వారికి తెలియజేస్తూ ఉండాలి.
2.డిజిటల్ నాయిస్:
సాధారణంగా ఎవరైనా మార్కెటింగ్,సేల్స్ వ్యక్తులు వచ్చి మనకు అవసరం లేని, ఇష్టపడని వస్తువును గురించి వివరిస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అలానే ఈ మధ్య డిజిటల్ మాధ్యమాల్లో ఈ రొద ఎక్కువైంది. డిజిటల్ మాధ్యమాల ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగేసరికి వినియోగదారులను చేరుకోవడం సవాలుగా మారుతోంది. వినియోగదారుల డిజిటల్ కళ్లు, చెవులను చేరుకోవాలంటే బ్రాండ్లు స్మార్ట్ సౌండ్లు చేయాల్సిందే. సచిత్ర సమాచారాన్ని తయారుచేయాల్సిందే.
3.ఖర్చు చేసే డబ్బు:
క్యాంపెయిన్ల ద్వారా సత్వర ఫలితాలు సాధించేందుకు, బ్రాండ్లను త్వరితగతిన ప్రచారాన్ని రాబట్టేందుకు వ్యాపార సంస్థలు డిజిటల్ మాధ్యమాన్ని తప్పక ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతకు ముందు లాగా బ్రాండ్లు, బహుళ జాతి సంస్థలు ఒక్కో మాధ్యమానికి కొంత కేటాయింపులు చేసి చేతులు దులుపుకుంటే ఇకపై ఏ మాత్రం సరిపోదు. టార్గెట్ కస్టమర్లను చేరుకునేందుకు అవసరమైన డిజిటల్ క్యాంపెయిన్ల(ప్రచారాల) కోసం ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా ముందడుగు వేయాల్సి వస్తుంది. దీంతో పోటీదారుల కంటే ఒక మెట్టు పైకి ఎదుగుతారు.
4.ఆలోచనలు, సమన్వయం(Ideas & integration) :
డిజిటల్ మాధ్యమాలు ఒక ఐలాండ్ లాగా ఒంటరిగా ఉండలేవు. ఇవన్నీ ఒకవైపు వీడియోలు, మరో వైపు యానిమేషన్, గ్రాఫిక్ ఇమేజెస్తో సమ్మిళితం కావలసి ఉంది. వివిధ డివైజెస్లో ఈ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుందనే ఇక్కడ ప్రధానం. ఇందుకోసం మంచిగా వర్కవుట్ అయ్యే ఆలోచనలు అవసరం. ఈ విధంగా పూర్తి డిజిటల్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బ్రాండ్లు సిద్దపడాలి.
5. హైపర్లోకలైజేషన్:
ప్రస్తుతానికి రాష్ట్రాలు, ప్రాంతాలు(రీజియన్స్) లక్ష్యం చేసుకుని ప్రకటన,మార్కెటింగ్ విధానాలు కొనసాగుతున్నాయి. ఇవి రాన్రాను స్మార్ట్ బిజినెస్ వ్యాపారాలుగా మారి జిప్కోడ్ సాయంతో క్లస్టర్ బేస్డ్ మార్కెటింగ్ అవతారాన్ని సంతరించుకుంటాయి. దీంతో ఉత్తమమైన హైపర్ లోకల్ అమ్మకపు విధానాలు, మార్కెటింగ్ పద్దతులు కొత్తగా ఏర్పడగలవు.
6. గూగుల్ :
కేవలం సెర్చ్ ఇంజిన్లలోనే కంటెంట్ను శోధించే పద్దతి నుంచి యూజర్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే సెర్చ్ చేసే విధానాలు మెరుగవతాయి. ఉదాహరణకు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాలలో అక్కడే ట్రెండింగ్ టాపిక్స్ ఇస్తున్నారు. భవిష్యత్తులో మీడియా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని అక్కడికక్కడే సమాచారాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో వీక్షకులకు చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాలు ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఏది ప్రకటనో, సమాచారమో తెలియకుండా వినియోగదారులను తికమకపెడితే కంటెంట్ మార్కెటింగ్నే ఇది దెబ్బతీస్తుంది.
7.ఫాలోయర్స్:
ఊరికే ఫ్యాన్స్(అనుచరులు) ఎక్కువ ఉంటే లాభం లేదు. అవి లైక్లు, షేర్ల రూపంలో ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదు. సంబంధం లేని ఫాలోయర్స్ ఉండటం మూలంగా ఏ ఉత్పత్తి, బ్రాండ్కైనా నిష్ప్రయోజనం. టార్గెట్ ఆడియెన్స్ను కొద్దిమందిని సమర్థవంతంగా చేరుకోగలిగినా అది దీర్ఘకాలంలో లాభించగలదు. కేవలం అంకెలకే ప్రాధాన్యతనివ్వకుండా ఫోకస్ను పెంచడం ద్వారా టార్గెట్ ఫాలోయర్స్ను చేరుకోవచ్చు. ఫ్యాన్స్కు ముఖ్యంగా అవసరమయ్యేది నాణ్యత. అందుకోసం బ్రాండ్లు కష్టపడాల్సి ఉంది.
8.ఈ-కామర్స్:
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాల విస్తరణ మూలంగా చిన్న చిన్న ఈ-కామర్స్ సంస్థలు అయితే తమకన్నా పెద్ద వాటిలో విలీనం అవడమో, లేదా విపణిలోనుంచి తప్పుకోవడమో జరగగలదు. దీంతో ఈ-కామర్స్లో తమదైన ముద్ర వేయాలనుకునే సంస్థలు బ్రాండ్ను బలంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు కష్టపడితేనే నిలదొక్కుకునేందుకు వీలుంది. పెద్ద ఈ-కామర్స్ సంస్థలను ఒక ప్లాట్ఫారంగా డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించి అలానే విస్తరించేందుకు సైతం అవకాశం ఉంది. గత ఒకటి, రెండేళ్ల నుంచి ఫుడ్ బిజినెస్లో ఉన్న ఈ-కామర్స్లో జరిగిందిదే.
9.నోట్ల రద్దు ప్రభావం:
పెద్ద నోట్ల రద్దు వల్ల నూతన సంవత్సర ప్రథమార్థం ప్రభావితం కాగలదు. ఫోకస్డ్ మార్కెటింగ్, విపరీతమైన ఖర్చుపెట్టి చేసే (aggressive add strategy)ప్రకటనా ప్రణాళికలను కొద్ది కాలం వాయిదా వేస్తారు. దీంతో డిజిటల్ ప్రకటనలకు అనుకున్నంత స్థాయిలో వృద్ది సాధించడం కాస్త కష్టమవుతుంది. అందుకు ధీటుగా మరింత వేగంగా విస్తరించేందుకు డిజిటల్ మాధ్యమాలు సన్నద్దమవ్వాల్సిందే.
10. కంటెంట్(సమాచారం):
కేవలం వాయిస్(వీడియో) కంటెంట్తోనే నెట్టుకురాగలడం ఇక మీద కష్టమే. సందర్భానికి తగ్గ సమాచారాన్ని ఎంత వేగంగా తయారుచేయగలిగామనేది వెబ్ మీడియాలో ప్రధాన అంశం. ప్రధాన ఆన్లైన్ మీడియా వెబ్సైట్ల మధ్య కంటెంట్ మార్కెటింగ్ వార్ జరగగలదు. అంటే మీడియా వెబ్సైట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడతాయి. బ్రాండ్లు తమ లక్షిత వినియోగదారులను చేరుకునేందుకు కొత్త వ్యూహాలను రచిస్తారు.
11.బ్రాడ్బ్యాండ్:
ఖర్చు, నాణ్యత పరంగానే కాకుండా ఎంత బాగా వాడేందుకు సౌలభ్యం కల్పిస్తుందనేదే డిజిటల్ కనెక్టివిటీలో ముఖ్యం. సాంకేతిక అక్షరాస్యులు క్రమంగా పెరుగుతున్న భారత్ లాంటి దేశాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీలో సమస్యలు లేకుండా నాణ్యత పాటించడం ప్రధానమైనది. ఈ అంశాలే పోటీతత్వాన్ని తట్టుకుని సంస్థను నిలదొక్కుకునేలా చేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో నెట్ వాడకంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు డిజిటల్ ఇండియా కార్యక్రమం తోడ్పడగలదు.
12.వీక్షకులు:
వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను చేరుకునేందుకు ప్రకటనలే ఆధారం. డిజిటల్ విప్లవంతో ప్రజలు ఎక్కువ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో టార్గెట్ ఆడియన్స్ను చేరుకునేందుకు బ్రాండ్లు కొంచెం శ్రమించాలి. ఎక్కువ మంది పాఠకులు తమదైన ఆసక్తుల మీదే దృష్టి కేంద్రీకరించి అందుకు అనుగుణమైన సామాజిక వేదికల్లోని గ్రూపుల్లో చేరతారు. దీంతో వీక్షకులు(వినియోగదారుల) అభిరుచులను తెలుసుకొని,ఆ విధంగా వారిని చేరుకునేందుకు ప్రణాళికలు రచించాలి.